ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని పలువురు ఎమ్మెల్యేలపై రాజకీయంగా విమర్శలు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. వివిధ అంశాల్లో సదరు వైసీపీ ఎమ్మెల్యేలు విపక్షాలకు టార్గెట్ అవుతుంటారు.
అయితే, తాజాగా మాజీ మంత్రి, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఓ అడుగు ముందుకు వేసి మరిన్ని సంచలన కామెంట్లు చేశారు. ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీలో భారీ అవినీతి జరిగిందని పేర్కొన్న ఈ అంశంపై `ట్విట్టర్` వేదికగా తీవ్ర ఆరోపణలు చేశారు.
లోకేష్ ఏమంటున్నారు?
ఇళ్ల స్థలాలకు భూ సేకరణలో ఎమ్మెల్యేలు, వైఎస్సార్సీపీ నేతలు అడ్డగోలుగా అవినీతికి పాల్పడి వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని మాజీ మంత్రి, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. పేదలకు అది సెంటు స్థలం, వైఎస్ జగన్కికి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు అది కుంభస్థలం అంటూ విరుచుకుపడ్డారు. స్థల సేకరణలో అవినీతి, చదును పేరుతో దోపిడీ, పంపిణీ పేరుతో పేదల రక్తాన్ని జలగల్లా పీల్చేస్తున్నారని మండిపడ్డారు. పేదల పేరుతో జగన్ రెడ్డి త్రీ ఇన్ వన్ స్కాం విలువ 6,500 కోట్లని ఆరోపించారు. టీడీపీ హయాంలో కట్టిన నాణ్యమైన ఇళ్లకు బులుగు రంగు వేసినంత మాత్రాన సైకిల్ బ్రాండ్ చెరిగిపోదు అని అన్నారు. ఇప్పటి వరకూ టీడీపీ కేసుల వలనే స్థలం ఇవ్వలేకపోతున్నాం అన్నారు మరి ఇప్పుడెలా ఇస్తున్నారంటూ లోకేష్ ప్రశ్నించారు. జగన్ కోటలోని మరుగుదొడ్డి కంటే తక్కువుగా కొండలు, గుట్టలు, శ్మశానాల్లో, చెరువుల్లో ఇచ్చే స్థలంలో పేదలు ఉండే పరిస్థితి లేదని లోకేష్ అన్నారు. ఇప్పుడున్న ఆధారాలతో జగనన్న జైలు పిలుస్తోంది పథకంలో భాగంగా 41 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు జైలులో జగన్ రెడ్డితో పాటు చిప్పకూడు తినడం ఖాయమంటూ లోకేష్ ట్వీట్ చేశారు
మరుగుదొడ్డి కంటే తక్కువ..
మరోవైపు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదలకు ఇచ్చే ఇంటి స్థలం జగన్ ఇంట్లో బాత్రూం అంత కూడా లేదని ఆయన ఎద్దేవా చేశారు. నివాసం ఉంటున్న సొంత స్థలానికి పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి పట్టా అంటారా అని ప్రశ్నించారు. పది లక్షల విలువైన స్థలాన్ని 50 లక్షలకు కొని, ప్రజలకు మాత్రం సెంటు భూమి మాత్రమే ఇస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల పట్టాల కొనుగోలులో 6500 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. దమ్ముంటే ఇళ్ల పట్టాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జేట్యాక్స్ కోసమే కొత్త పథకాలు ప్రారంభిస్తున్నారని అచ్చెన్నాయుడు విమర్శించారు . సెంటు భూమిలో కట్టే ఇంట్లో తనలాంటి ఎత్తు ఉన్న వాళ్లు పడుకోవడం సాధ్యం కాదని చెప్పారు.