శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాల బుక్ లెట్లను టీటీడీ బోర్డు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి బుధవారం ఈవో ఎవి ధర్మారెడ్డితో కలిసి శ్రీవారి ఆలయం ఎదుట ఆవిష్కరించారు. అనంతరం ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది అధిక మాసం కారణంగా సెప్టెంబరు 18 నుండి 26వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 15 నుండి 23వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయని చెప్పారు. సెప్టెంబర్ 18న ధ్వజారోహణం సందర్భంగా ముఖ్య మంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు.
సామాన్య భక్తులకు సంతృప్తికరంగా వాహన సేవలతో పాటు మూలమూర్తి దర్శనం కల్పిస్తామన్నారు. బ్రేక్ దర్శనాల కోసం సిఫారసు లేఖలు స్వీకరించబోమని స్పష్టం చేశారు. రెండు బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాల అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నారని భూమన వివరించారు. ముఖ్యంగా సెప్టెంబరు 22న గరుడ సేవ, 23న స్వర్ణరథం, 25న రథోత్సవం, 26న చక్రస్నానం, ధ్వజావరోహణం నిర్వహిస్తామని తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామి వారి వాహన సేవలను దర్శించాలని ఈ సందర్భంగా ఛైర్మన్ భూమన కోరారు.
ఈ కార్యక్రమంలో జెఈవో వీరబ్రహ్మం, శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు, శ్రీకృష్ణ శేషాచల దీక్షితులు, ఆలయ డెప్యూటీ ఈవో లోకనాథం పాల్గొన్నారు.
ఏపీలో ఎస్ఐ అభ్యర్ధులకు అలర్ట్ .. ఫైనల్ పరీక్షలకు షెడ్యుల్ విడుదల ..ఎప్పుడంటే..