Vangaveeti Radha: మాజీ ఎమ్మేల్యే వంగవీటి రాధా గుడివాడలో తరచు కాపు సంఘం ముఖ్యనేతలతో సమావేశం అవుతుండటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. గుడివాడ మీదుగా ఏ ప్రాంతానికి వెళ్లాల్సి వెళ్లాల్సి వచ్చినా అక్కడి స్థానిక నేతలతో రాధా తప్పకుండా సమావేశం అవుతున్నారు. తాజాగా నేడు గుడివాడ ఆర్టీసీ కాలనీలో నియోజకవర్గ కాపు సంఘం ముఖ్య నేతలతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వాస్తవానికి వంగవీటి రాధా టీడీపీలో ఉన్నారు. గుడివాడ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడాలి నాని మంత్రిగా ఉన్నారు. పార్టీలు వేరు అయినా వంగవీటి రాధ, వల్లభనేని వంశీ, కొడాలి నాని మంచి మిత్రులు అన్న సంగతి రాష్ట్ర రాజకీయ వర్గాల్లో అందరికీ తెలిసిందే. ఇంతకు ముందు హైదరాబాద్ లో రాజకీయాలకు అతీతంగా గంటా శ్రీనివాసరావు నేతృత్వంలో జరిగిన కాపు నేతల భేటీలోనూ వంగవీటి రాధా పాల్గొన్నారు. ఆ తరువాత జరిగిన రెండవ మీటింగ్ లో రాధా హజరు కాలేదు.
Vangaveeti Radha: రెక్కీ సంచలనం
ఇటీవల తనను హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించారంటూ వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం అయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో మంత్రి కొడాలి నాని ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళ్లడంతో వెంటనే స్పందించి గన్ మెన్ లను ఏర్పాటు చేయాలంటూ పోలీస్ శాఖను ఆదేశించారు. అయితే రాధా తనకు గన్ మెన్ల భద్రత అవసరం లేదని తిరస్కరించారు. అయినప్పటికీ రాధ కార్యాలయం వద్ద నివాసం వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ నేపథ్యంలోనే చంద్రబాబు ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు.
నోకామెంట్స్ వ్యాఖ్యలతో భేటీలపై సస్పెన్స్
రాబోయే ఎన్నికల్లో గుడివాడలో కొడాలి నాని మీద రాధాను పోటీ చేయించేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోందని గతంలో వార్తలు వచ్చాయి. మరో పక్క ఇటీవల జరిగిన పరిణామం నేపథ్యంలో రాధాను వైసీపీలో చేర్చేందుకు కొడాలి నాని, వల్లభనేని వంశీలు ప్రయత్నిస్తున్నారంటూ కూడా పుకార్లు షికారు చేశాయి. అయితే ఇప్పటి వరకూ ఏ వార్తలపైనా రాధా స్పందించలేదు. పార్టీలకు అతీతంగా ఏ పార్టీ వాళ్లు వంగవీటి రంగా విగ్రహాల ఆవిష్కరణకు ఆహ్వానించినా రాధా హజరవుతూ వస్తున్నారు. వంగవీటి రంగా అభిమానులు అన్ని రాజకీయ పార్టీల్లో ఉండటంతో వీళ్లంతా పార్టీలకు అతీతంగా రాధాను అబిమానిస్తుంటారు. గుడివాడలో ఎక్కువగా వైసీపీకి చెందిన కాపు నేతలు రాధా భేటీలో పాల్గొంటున్నారు. అయితే గుడివాడలో తరచు సమావేశాలు నిర్వహించడానికి కారణం ఏమిటని మీడియా రాధాను ప్రశ్నించగా నో కామెంట్స్ అన్నట్లు గుడివాడలో మాట్లాడేందుకు చాలా టైమ్ ఉందని వెళ్లిపోవడం సస్పెన్స్ కు, రాజకీయంగా చర్చకు దారి తీస్తోంది.