Visakha steel plant : ఓ పక్క విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ప్రతిపాదనను నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనకు ఏపి సమాయత్తం అవుతుండగా కేంద్ర ఉక్క శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన విషయాలను వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజ్యసభ సాక్షిగా కీలక విషయాన్ని వెల్లడించారు.
పోస్కో ప్లాంట్ కోసం విశాఖ ఉక్కు కర్మాగారంతో 2019లోనే ఒప్పందం కుదిరిందని చెప్పారు. పోస్కో ప్రతినిధి ఇప్పటికే మూడు సార్లు విశాఖ స్టీల్ ప్లాంట్ ను సందర్శించారని కూడా తెలిపారు. పోస్కో, ఆర్ఐఎన్ఎల్ మధ్య భూముల అప్పగింతకు ఒప్పందం కుదిరిందని చెప్పారు. పోస్కో ప్లాంట్ ఏర్పాటునకు జాయింట్ వర్కింగ్ గ్రూపును ఇప్పటికే ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కొత్త ప్లాంట్ లో పోస్కో వాటా 50శాతంగా ఉందని అయితే ఆర్ఐఎన్ఎల్ వాటా ఎంత అనేది ఇంకా నిర్ణయించలేదని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమాధానం ఇచ్చారు.