Vizag steel plant Employees strike: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు చేస్తున్న ఆందోళనలు మరింత ఉధృతం అవుతున్నాయి. గత కొద్ది రోజులుగా కార్మిక సంఘాల నిరసనలు కొనసాగుతున్నాయి. తాజాగా స్టీల్ ప్లాంట్ లో సమ్మె సైరన్ మోగనున్నది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సమ్మె నోటీసు ఇచ్చింది.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం ఉపసంహరించుకోవాలనీ, సీతమ్మధార భూముల విక్రయ ఒప్పందం రద్దు చేయాలనీ, పోస్కోతో జరిగిన ఒప్పందం రద్దు చేయాలనీ డిమాండ్ చేస్తూ సీఎండీకి గురువారం సమ్మె నోటీసు అందజేశారు. ఆర్ కార్డు ఉన్న నిర్వాసితులకు శాశ్వత ఉపాధి కల్పించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఈ నెల 25వ తేదీ తర్వాత సమ్మెకు వెళతామని కార్మిక సంఘాల నేతలు నోటీసులో పేర్కొన్నారు. ప్రైవేటీకరణ నిర్ణయంపై వెనక్కి తగ్గే వరకూ పోరాటం చేస్తామని కార్మిక నేతలు స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం 14 రోజుల నోటుసు గడువు ఇచ్చారు. ఈ నెల 17న అఖిలపక్షం, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించాలని కార్మికులు నిర్ణయించారు. 20న కార్మికుల కుటుంబాలతో బహిరంగ సభ నిర్వహించనున్నారు.