Chandrababu – Pawan Kalyan: అమరావతి రాజధాని పరిధిలోని మందడంలో టీడీపీ – జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు జాతికి స్వర్ణయుగం – సంక్రాంతి సంకల్పం పేరుతో ఆయా పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల ఉత్తర్వులు, అమరావతి వ్యతిరేక ప్రతులను భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఇద్దరు నేతలు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తొందంటూ దుయ్యబట్టారు. రాష్ట్రానికి మంచి రోజులు వస్తున్నాయని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు పేర్కొన్నారు. అమరావతే మన రాజధాని, త్వరలో ఇక్కడ నుండే పేదల పాలన మొదలు కాబోతోందని అన్నారు.
ఈ కార్యక్రమంపై వైసీపీ నేత, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్రంగా స్పందించారు. పండుగలను రాజకీయం చేయవద్దని చంద్రబాబు, లోకేష్ లకు హితవు పలికారు. జగన్ ను సీఎం కుర్చీ లోంచి దించేసి తాను సీఎం అయిపోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని అన్నారు. కుప్పంలో ఓడిపోతాడని చంద్రబాబుకి అర్ధమైపోయిందని, అందుకే ఈ సారి కుప్పం వెళ్లకుండా అమరావతిలోనే ఉండిపోయారని విమర్శించారు.
చంద్రబాబు, పవన్, లోకేష్ ఎక్కడ పోటీ చేయాలో తెలియక భయపడుతున్నారని అన్నారు వెల్లంపల్లి. అమరావతిలో కూర్చుని చంద్రబాబు, పవన్ నీచ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలవడం ఖాయం.. వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయమని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఏడు స్తానాలు గెలిచి సీఎం జగన్ కానుకగా ఇస్తామని వెల్లంపల్లి అన్నారు.
మరో పక్క వైసీపీ విద్యార్ధి విభాగం ఆధ్వర్యంలో చంద్రబాబు కోసం జర్నలిజం విలువలు వదిలేసి .. అబద్దాలతో ఏపీ ప్రభుత్వంపై నిత్యం విషం చిమ్ముతున్నారంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లను బోగి మంటల్లో వేసి తగులబెట్టారు. ఇకనైనా బుద్ది తెచ్చుకుని వాస్తవాలతో ప్రజా సంక్షేమానికి పని చేయాలని సూచించారు.
Sankranthi Celebrations 2024: సీఎం జగన్ నివాసంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు