ఏపిలో రాజదానుల వ్యవహారం రోజురోజుకు హీట్ ఎక్కుతోంది. ఓ వైపు అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అమరావతి జేఏసి ఆధ్వర్యంలో అ పాంత రైతులు అరసవెల్లికి మహాపాదయాత్ర నిర్వహిస్తుండగా, విశాఖలో ఉత్తరాంధ్ర ప్రాంత వైసీపీ నేతలు రాజధాని వికేంద్రీకరణకు మద్దతుగా నాన్ పొలిటికల్ జేఏసీగా ఏర్పడి కార్యాచరణ ప్రకటించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చోడవరం వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. మూడు రాజధానులకు మద్దతుగా తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను జేఏసీ కన్వీనర్ లజపతిరాయ్ కి అందజేశారు. పరిపాలనా వికేంద్రీకరణకు మద్దతుగా తాను రాజీనామా చేస్తున్నట్లు తెలిపిన ధర్మశ్రీ .. దమ్ముంటే ..మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (అచ్చెన్న) ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అచ్చెన్నాయుడుపై పోటీ చేయడానికి తాను సిద్దంగా ఉన్నానంటూ సవాల్ విసిరారు ధర్మశ్రీ.
ఈ నెల 15వ తేదీన విశాఖ రాజధానికి మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహిస్తామని ధర్మశ్రీ తెలిపారు. అంబేద్కర్ సర్కిల్ నుండి వేలాది మందితో ర్యాలీ నిర్వహిస్తామనీ, భారీ నిరసన ప్రదర్శనతో రాజధాని ఆకాంక్షను బలంగా తెలియజేస్తామని చెప్పారు. జేఏసీ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. మూడు రాజధానులకు అనుకూలంగా మరి కొందరు వైసీపీ ప్రజా ప్రతినిధులు రాజీనామాలకు సిద్ధమవుతున్నారు. సీఎం అంగీకరిస్తే మంత్రిపదవికి రాజీానామా చేసి ఉద్యమంలో పాల్గొంటానని ఇప్పటికే ధర్మాన ప్రసాదరావు ప్రకటించగా, మూడు రాజధానులకు మద్దతుగా అవసరమైతే తాను రాజీనామాకు సిద్దమంటూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ తెలిపారు. ధర్మశ్రీ రాజీనామా లేఖ ఇచ్చిన నేపథ్యంలో రానున్న రోజుల్లో మరి కొంత మంది ఎమ్మెల్యేలు రాజీనామాల బాట పట్టే అవకాశం ఉందని అంటున్నారు.