YS Sharmila : దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి సోదరి షర్మిలమ్మ తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నద్దం అయిన విషయం తెలిసిందే. ఇది ఒక రకంగా తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలన వార్త అయ్యింది. షర్మిల రాజకీయ పార్టీ ఏర్పాటుపై గత కొద్ది రోజులుగా వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ ఇటీవల ఆమె లోటస్ పాండ్ వేదికగా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు వైఎస్ఆర్ అభిమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. షర్మిల ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశం రోజు లోటస్ పాండ్ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో జగన్ ఫోటో లేకపోవడంపైనా తీవ్ర చర్చజరిగింది. జగన్ సమ్మతి లేకుండానే షర్మిల రాజకీయ పార్టీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నదని అనుకున్నారు. అయితే మీడియాతో తన సోదరుడు జగన్ సహకారం అంటుందని షర్మిల ఆశాభావం వ్యక్తం చేశారు.
షర్మిల ఫ్లెక్సీలో ప్రత్యక్షమైన జగన్, విజయమ్మ ఫోటోలు
అయితే అదే సందర్భంలో ఏపిలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణలో పార్టీ ఏర్పాటు అనేది షర్మిల వ్యక్తిగత నిర్ణయమని చెప్పారు. పొరుగు రాష్ట్రంతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగాలన్న భావతో తెలంగాణలో వైసీపీ విస్తరించలేదని చెప్పుకొచ్చారు. జగన్మోహనరెడ్డి, షర్మిల మధ్య విబేధాలు అయితే లేవు గానీ పార్టీ ఏర్పాటు విషయంలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ మరో విషయం ఏమిటంటే లోటస్ పాండ్ వద్ద మరుసటి రోజు ఏర్పాటు చేసిన షర్మిల ఫ్లెక్సీల్లో సోదరుడు జగన్, తల్లి విజయమ్మ ఫోటోలు కూడా దర్శనమిచ్చాయి. తమ కుటుంబంలో విబేధాలు ఏమీ లేవని, అందరూ ఒకటే అన్న సూచన వచ్చేందుకు షర్మిల సూచనల మేరకే ఆమె అనుయాయులకు ఆ తరువాత ఫ్లెక్సీలలో జగన్, విజయమ్మ ఫోటోలు ఏర్పాటు చేశారని అంటున్నారు.
YS Sharmila : షర్మిల యు టర్న్ తీసుకుంటారా ?
తాజా పరిణామాలతో షర్మిల రాజకీయ పార్టీ ఏర్పాటు విషయంలో యూ టర్న్ తీసుకోనున్నారా అన్న ఊహగానాలు కూడా సాగుతున్నాయి. అందుకు కారణం ఏమిటంటే ఈ నెల 21వ తేదీన ఖమ్మం జిల్లా పర్యటన పెట్టుకున్న షర్మిల ఈ ఫ్రోగ్రామ్ వాయిదా వేసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతున్నందున పర్యటన వాయిదా వేసుకున్నారనీ, ఈ ఎన్నికల తరువాత ఖమ్మం టూర్ ఫ్రోగ్రామ్ ఉంటుందని షర్మిల వర్గీయులు చెబుతున్నారు. అయితే తాడేపల్లి నుండి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) లోటస్ పాండ్ కు వెళ్లి షర్మిల, ఆమె భర్త బ్రదర్ అనిల్ తో సుదీర్ఘంగా చర్చలు జరిపిన తరువాత ఖమ్మం పర్యటనను వాయిదా వేసుకుని షర్మిల బెంగళూరు వెళ్లారు. అన్నా చెల్లిళ్ల మధ్య గ్యాప్ ను తగ్గించడానికే ఆర్కే వచ్చి మంతనాలు సాగించి ఉంటారని భావిస్తున్నారు. అయితే ఇదే క్రమంలో షర్మిల తల్లి విజయమ్మ, షర్మిల వదిన (జగన్ సతీమణి) భారతి కూడా బెంగళూరుకు వెళ్లినట్లు తెలుస్తుంది. ఆర్కే వెళ్లి చర్చలు జరిపి వెళ్లిన తరువాత విజయమ్మ, భారతిలు బెంగళూరుకు వెళ్లి షర్మిలతో మంతనాలు జరుపుతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పుడు బెంగళూరులో ఏమి జరుగుతుంది. విజయమ్మ, భారతమ్మలు షర్మిలతో ఏమి చెపుతున్నారు. షర్మిల రాజకీయ పార్టీ విషయంలో ముందుకే వెళతారా లేక కుటుంబ ఒత్తిడి కారణంగా వెనక్కు తగ్గుతారా అనేది మరి కొద్ది రోజుల్లో తేలనున్నది.