YS Jagan : తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీనర్శింహస్వామి వారి నూతన రథాన్ని శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రారంభించారు. గత ఏడాది సెప్టెంబర్ 5న అంతర్వేది రథాన్ని గుర్తు తెలియని దుండగులు దగ్ధం చేసిన విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారం చెలరేగడంతో ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. అయితే ఘటన జరిగిన రోజే దీనిపై స్పందించిన జగన్.. స్వామి వారి కళ్యాణోత్సవాల నాటికి నాటికి కొత్త రథం నిర్మిస్తామని ప్రకటించారు. ఆనాడు ప్రకటించిన విధంగా రూ.95లక్షల వ్యయంతో రధాన్ని యుద్ధప్రాతిపదికన సిద్ధం చేశారు.
తొలుత అంతర్వేది షిప్పింగ్ హార్బర్ లో ఏర్పాటు చేసిన హెలిపాడ్లో హెలికాఫ్టర్ దిగిన సీఎం వైఎస్ జగన్ 11.35 గంటలకు శ్రీలక్ష్మీనర్శింహస్వామి ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్నారు. ఆలయ అర్చకులు, వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తదుపరి స్వామివారిని దర్శించుకుని పత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. అనంతరం నూతన రథాన్ని జగన్ ప్రారంభించారు. సీఎం జగన్ వెంట దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తదితరులు పాల్గొన్నారు.