YS Jagan: ఆంధ్రప్రదేశ్ లో నూతన పీఆర్సీ జీవోలను వెనక్కు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ నూతన పీఆర్సీ అనుమతించబోమని ఉద్యోగ సంఘాలు పీఆర్సీ సాధన సమితి పేరుతో ఉద్యమ కార్యాచరణ కొనసాగిస్తుండగా ప్రభుత్వం ఏమాత్రం వెనక్కు తగ్గకుండా కొత్త పీఆర్సీతో వేతనాలు అంటూ ఆదేశాలు ఇచ్చేసింది. ట్రెజరీ ఉద్యోగుల మెడపై కత్తి పెట్టి మరీ నూతన పీఆర్సీకి అనుగుణంగా వేతనాల చెల్లింపు ప్రొసెస్ చేయించేస్తోంది. ప్రభుత్వానికి ఈ తలనొప్పి తీరకమునుపే మరో తలనొప్పి వచ్చిపడింది.
YS Jagan: హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గాన్ని సత్యసాయిబాబా జిల్లాగా
ఇదే క్రమంలో ప్రభుత్వం రాష్ట్రంలోని 13 జిల్లాలను 26 జిల్లాలుగా ప్రకటిస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే కొత్త జిల్లాల కేంద్రాల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతుండగా కొన్ని ప్రాంతాల్లో తమ ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా చేయాలంటూ ఆందోళనలు జరుగుతున్నాయి. సీఎం జగన్మోహనరెడ్డి కొత్త జిల్లాల ఏర్పాటునకు తీసుకున్న నిర్ణయాన్ని పలు ప్రాంతాలు స్వాగిస్తుండగా మరి కొన్ని ప్రాంతాల్లో వ్యతిరేకతలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లాల విభజనలో భాగంగా అనంతపురం జిల్లాను రెండు జిల్లాలుగా విభజించారు. అనంతపురంలోని హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గాన్ని సత్యసాయిబాబా జిల్లాగా నామకరం చేస్తూ పుట్టపత్రిని జిల్లా కేంద్రంగా ప్రకటించారు.
అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్
దీంతో పుట్టపత్రిలో ఆనందోత్సాహాలు వ్యక్తం అవుతుండగా హిందూపురంలో నిరసనలు వ్యక్తం అయ్యాయి. హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ పెద్ద ఎత్తున వినిపిస్తున్నారు. ఆ ప్రాంత ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ కూడా హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించి సత్యసాయి బాబా జిల్లా పేరునే కొనసాగించాలని కోరుతున్నారు. ఈ డిమాండ్ పై అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్ కూడా నిర్వహించారు. వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్చందంగా మూసివేసి బంద్ కు సహకరించాయి.