ys jagan ఏపీలో పంచాయతీ ఎన్నికల కేంద్రంగా జరుగుతున్న రాజకీయ ఎత్తుగడల పరంపర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు . ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వర్సెస్ ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ అన్నట్లుగా ఎత్తులు – పై ఎత్తులు కనిపిస్తున్నాయి.
అనేక ఘట్టాలు దాటిన ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ రాజ్ ఎన్నికలను నిర్వహించాలని సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడంతో ఇక ఎన్నికలు జరగడమే తరువాయి అనుకుంటున్న సమయంలో ప్రభుత్వం స్పందించింది. అయితే , ఇక్కడ తనదైన శైలిలో కేంద్రాన్ని ఇరికించింది.
ys jagan : జగన్ నమ్మినబంటు ఏమన్నారో తెలుసా?
సుప్రీం కోర్టు తీర్పు నేపధ్యంలో తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం నమ్మినబంటు , రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమే అని ప్రకటించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను మధ్యలోనే ఆపేసి పంచాయతీ ఎన్నికలను తీసుకురావడంలో రాజకీయ కుట్ర దాగి ఉందని సజ్జల ఆరోపించారు. ఎస్ఈసీ మొండి వైఖరి వల్లే సుప్రీంకోర్టు పిటిషన్ వేశామన్న సజ్జల ఎన్నికల కంటే ప్రజారోగ్యమే ముఖ్యమని ఎస్ఈసీకి వివరించామని అయినా ఆయన వినలేదన్నారు. పంచాయతీ ఎన్నికలు, వ్యాక్సినేషన్ ఒకేసారి నిర్వహిస్తే గందరగోళ పరిస్థితికి దారితీస్తాయని సుప్రీంకోర్టుకు వివరించామన్నారు. ఎస్ఈసీ షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు ఉంటాయన్న ఆయన ప్రజారోగ్యం కోసం ఇన్నాళ్లు ఎన్నికలు వద్దు అనుకున్నాం అనీ కానీ షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు ఉంటాయని అన్నారు. పంచాయతీ ఎన్నిలకల ప్రక్రియను ప్రారంభించాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలిచ్చామని చెప్పారు.
బొత్స ఏమంటున్నారంటే..
మంత్రి బొత్స సత్యన్నారాయణ సైతం మరో మీడియా సమావేశంలో ఇదే వ్యాఖ్యలు చేశారు. సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని, ఎన్నికలకు వెళ్లేందుకు తమకు ఎలాంటి భయం లేదని ప్రకటించారు. వ్యాక్సినేషన్, ఎన్నికలు రెండు ఒకేసారి నిర్వహించడం అంటే కష్టం అని మంత్రి బొత్స సత్యన్నారాయణ పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం గురించే ఇన్నాళ్లు వాయిదా వేయాలని కోరామని పేర్కొంటూ పంచాయతీ ఎన్నికల్లో ఖచ్చితంగా వందశాతం విజయం సాధిస్తామని అన్నారు.
అసలు ట్విస్టు ఇక్కడే
కరోనా వ్యాక్సినేషన్ విషయంలో కేంద్రానికి లేఖ రాశామని, కేంద్రం నుంచి వచ్చే గైడ్ లైన్స్, డెసిషన్ ఆధారంగా ఎన్నికలకు వెళ్తామని బొత్స తెలిపారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారే ఎన్నికల విధుల్లో పాల్గొనాల్సి ఉంటుందని బొత్స పేర్కొన్నారు.
విధుల నిర్వహణ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు తమ అభ్యంతరాలను చెప్పాయని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వలే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకైనా ఇదే ఇబ్బంది ఉంటుందని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు కూడా ఎన్నికలు నిర్వహించాలని చెప్పిన నేపథ్యంలో వ్యాక్సినేషన్ పై కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మొత్తంగా కేంద్రం కోర్టులోకి ఏపీ ప్రభుత్వం బాల్ నెట్టుతోందనే విషయం స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.