YS Vivekananda Reddy: ఎవరైనా తప్పుకు దొరికిపోతున్నారు అంటే చివరి నిమిషంలో దాని నుండి ఎలాగైనా తప్పుకోవాలనేది మానవ లక్షణం. తప్పును నిజాయితీగా ఒప్పుకోవడం అనేది సినిమాల్లో జరుగుతుంటుంది కానీ నిజ జీవితంలో అరుదే. ఆధారాలు, సాక్షాలతో దొరికిపోయినా సరే ఏదో రకంగా తప్పించుకోవాలని చూస్తుంటాం. అలాగే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా….అదే జరుగుతోంది. ఎందుకంటే ఇటీవల దేవిరెడ్డి శివశంకర రెడ్డిని సీబీఐ అరెస్టు చేసిన క్రమంలో ఆయన సీబీఐ డైరెక్టర్ కు ఓ లేఖ రాశారు. “నా చేత బలవంతంగా ఒప్పిస్తున్నారు. నన్ను కావాలని ఇబ్బంది పెడుతున్నారు. కానీ ఈ హత్య కేసులో వివేకానంద రెడ్డి అల్లుడు రాజశేఖరరెడ్డి ప్రమేయం ఉంది. ఆయనను విచారించాలి. కడప ఎమ్మెల్సీ బీటెక్ రవి ప్రమేయం ఉంది, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి ప్రమేయం ఉంది వాళ్లను విచారించాలి” అంటూ సీబీఐ డైరెక్టర్ కు రాసిన లేఖలో పేర్కొన్నాడు. ఎవరైతే అనుమానితులుగా ఉన్నారో, ఎవరైతే ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్లు తెరవెనుక నుండి ఈ కథను నడిపిస్తున్నారు. తెలుగు సినిమాల్లో విలన్ చివరి నిమిషంలో రకరకాల ప్రయోగాలు, రకరకాల తెలివితేటలు బయటకు వస్తుంటాయి కదా అదే మాదిరిగా ఈ కేసులో కూడా అలాగే జరుగుతున్నట్లు చెప్పుకోవచ్చు.
YS Vivekananda Reddy: మొన్న శివశంకర్ రెడ్డి, నేడు గంగాధర్ రెడ్డి లేఖలు
ఇదంతా ఎందుకు అంటే ఈ రోజు కూడా వివేకానంద రెడ్డి హత్య కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా ఎస్పీ ఫక్కీరప్పను గంగాధరరెడ్డి కలిశారు. ” సీీబీఐ, వివేకానంద రెడ్డి అనుచరుల నుండి తనకు ప్రాణ హాని ఉంది. పది కోట్లు ఇస్తామని సీబీఐ ఆఫర్ చేసింది. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి, భాస్కరరెడ్డి, శివశంకర్ రెడ్డిల పాత్ర ఉందని చెప్పాలని సీబీఐ ఒత్తిడి చేస్తున్నది. వారి ఒత్తిడితో తానే చంపానని ఒప్పుకోవాలని సీబీఐ అధికారులు బలవంతం చేస్తున్నారు. ఆ హత్యతో సంబంధం లేదు. చేయని నేరాన్ని తాను చెప్పేది లేదంటూ” గంగాధర్ రెడ్డి చెప్పారు. ఈ మేరకు ఎస్పీకి లేఖ అందించి తనకు రక్షణ కల్పించాలంటూ గంగాధర్ రెడ్డి కోరారు. దీనిపై ఎస్పీ స్పందించారు. గంగాధర్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఆయనకు రక్షణ కల్పిస్తాము, సీబీఐ, వివేకా అనుచరులు, సీఐ శ్రీరాంపై ఫిర్యాదు చేశాడు, ఫిర్యాదులోని అంశాలపై డీఎస్పీ స్థాయి అధికారితో విచారణ జరిపిస్తామని పేర్కొన్నారు. గంగాధర్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు నమ్మశక్యంగా ఉన్నాయా అనేది లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. తప్పుడు సాక్షం చెప్పాలని సీబీఐ పది కోట్లు ఆఫర్ చేస్తుందా ? అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. ఇదంతా చేయిస్తున్నది ఎవరు ? మొన్న దేవిరెడ్డి శంకర్ రెడ్డి ఒక లేఖ రాశారు. ఇప్పుడు గంగాధర్ రెడ్డి ఈ లేఖ రాశారు.
కేసులో కొత్త మలుపులు
అంటే ఈ హత్య కేసులో ప్రధాన నిందితులు దొరికిపోతారు, దర్యాప్తు ఇక చివరి దశకు చేరింది. ఇక అరెస్టులు ఉంటాయి అనుకుంటున్న తరుణంలో కొత్త మలుపులు వస్తున్నాయి. ఈ కోణంలో కూడా నిజంగా దర్యాప్తు జరగాలి. అటు శివశంకర్ రెడ్డి రాసిన లేఖపైనా, ఇటు గంగాధర్ రెడ్డి చేసిన ఫిర్యాదుపైనా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపితే ఎవరైనా కుట్రలు పన్నుతున్నారా? వీళ్ల చేత ఎవరైనా బలవంతంగా లేఖలు రాయిస్తున్నారా ? లేదా నిజంగా వీళ్ల చేత అబద్దపు సాక్షాలు చెప్పాలని చూస్తున్నారా ?, ఫలానా వాళ్ల పేర్లు చెప్పమని నిజంగానే వీళ్లను బెదిరిస్తున్నారా ? అనేవి కూడా తేల్చాల్సి ఉంది. వీళ్ల రాసిన లేఖలోని అంశాలపైనా దర్యాప్తు జరపాలి. ఆ లేఖలోని అంశాలు నిజం కాకపోతే వీళ్లు ఎందుకు లేఖలు రాస్తున్నారు ?, దీని వెనుక ఉద్దేశం ఏమిటి ? కేసును డైవర్ట్ చేయాలనుకుంటున్నారా ? ఎవరైనా ప్రధాన నిందితుడు వీళ్ల చేత బలవంతంగా లేఖలు రాయిస్తున్నారా ? వీళ్ల వెనుక ఎవరు ఉన్నారు ? అనేది కూడా దర్యాప్తు చేయాలి. అంటే రెండు వైపులా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. వీక్లీ సీరియల్ గా మారుతున్న వివేకా హత్య కేసు దర్యాప్తులో ఇక ముందు ముందు ఇంకా ఎన్నెన్ని ట్విస్ట్ లు చోటుచేసుకుంటాయో వేచి చూడాలి.