YSRCP: కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గ వైసీపీలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. వైసీపీలో వర్గ విభేదాలు రోజురోజుకు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. రీసెంట్ గా పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గీయులు ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించి మంత్రి వేణుగోపాలకృష్ణ పై అసమ్మతి గళం వినిపించారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు సూర్యప్రకాష్ కు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలనీ, సూర్యప్రకాష్ కు కాకుండా వేణుగోపాలకృష్ణకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఆయనను ఓడిస్తామని హెచ్చరించారు.
ఈ సమావేశం జరిగిన మరుసటి రోజు జగనన్న సురక్ష కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కొలమూరి శివాజీని మంత్రి వేణు అనుచరుడు జత్తుక ఉదయ్ కాంత్ నిలదీశాడు, వైస్ చైర్మన్ పదవి ఇచ్చిన మంత్రి వేణుగోపాలకృష్ణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తావా అని దూషిస్తూ కాలర్ పట్టుకుని చేయి చేసుకున్నాడు. అక్కడే ఉన్న మంత్రి వేణు వారించే ప్రయత్నం చేసినా ఉదయ్ కాంత్ ఆగలేదు. ఈ ఘటనతో మనస్తాపానికి గురైన శివాజీ కొద్ది సేపటికి చీమల మందు నీటిలో కలుపుకుని తాగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డాడు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు.
ఈ పరిణామాల క్రమంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇవేళ తాడేపల్లికి చేరుకుని సీఎం వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు. మంత్రి వేణుగోపాలకృష్ణ, ఆయన అనుచరుల వ్యవహార శైలిపై పిల్లి సీఎం కు ఫిర్యాదు చేశారు. సుమారు గంట పాటు సీఎం జగన్ తో పిల్లి సుభాష్ చంద్రబోస్ సమావేశమైయ్యారు. రామచంద్రాపురంలో నెలకొన్న ఈ విభేదాలపై సీఎం జగన్ ఏ విధంగా స్పందించారు అనేది తెలియరాలేదు.
TTD: శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల చేసిన టీటీడీ