జగన్ పాలన మొదలయ్యి అలా ఏడాది పూర్తయిందో లేదో సొంత పార్టీలోనే అసంతృప్తి మెల్లగా తారాస్థాయికి చేరుకుంది. సీనియర్ నాయకులు పదవి వియోగాన్ని తట్టుకోలేకపోతున్నారు. అలాగని వారి బాధ అంతా లోపల దాచుకోకుండా అవకాశం దొరికిన ప్రతిసారి సొంత పార్టీపైనే బురద జల్లుతున్నారు. వీరిలో చాలామంది తమ రాజకీయ జీవితాలను కాంగ్రెస్ పార్టీకే అంకితం చేసిన వారు కాగా ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వైసిపి లాంటి ప్రాంతీయ పార్టీ లో జగన్ లాంటి ఏక నాయకుది ఆధ్వర్యంలో పనిచేస్తున్నారు. ఈ ప్రతికూల పవనాలు మెల్లగా సాగుతూ చివరికి జగన్ వైపు గా రావడానికి పెద్ద సమయం పట్టదు పోవచ్చని విశ్లేషకుల అంచనా.
వివరాల్లోకి వెళితే మొన్న మాజీ మంత్రి మరియు సీనియర్ మోస్ట్ నాయకుడు ఆనం రామనారాయణ రెడ్డి సొంత ప్రభుత్వంపై తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేసిన తీరుని చూశాం. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆయన ఉమ్మడి ఏపీలో కీలక మంత్రిత్వశాఖకు నాయకత్వం వహించారు. అటువంటి ఆనం ఇప్పుడు కేవలం ఎమ్మెల్యే గా ఉండడం నామోషీగా కచ్చితంగా ఫీల్ అవుతాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే మొన్న తన నియోజకవర్గ అభివృద్ధి పనులను అడ్డుపెట్టుకుని అధికారులతో మొదలెట్టి చివరికి అసలు విషయమైన మంత్రుల పనితీరు వరకు విమర్శల వర్షం కురిపించారు. ఇక విజయనగరం జిల్లా లోని ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి గారి సొంత మేనమామ మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖరరాజు కూడా అదే తీరులో…. ఏడాది కాలంలో కురుపాం లో అభివృద్ధి ఊసే లేదని ఆయన అధికార పార్టీ గాలి తీశారు.
ఇదిలా ఉండగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సైతం మంత్రి పదవి దక్కక పోవడంతో తీవ్ర నిరాశ చెంది ఇప్పుడు తన ఆక్రోశాన్ని మరియు ఆవేదనను మెల్లగా వెళ్లగక్కుతున్నాడు. సమయం దొరికినప్పుడల్లా సొంతపార్టీ పైన విమర్శలు చేస్తున్న ఆయన ఈ ప్రభుత్వంలో చాలా నిర్లక్ష్యం ఉందని…. ఇదేనా మన పాలన అంటూ తరచూ మీడియా కి ఎక్కుతున్నారు. తాజాగా ఆయన ఆరోగ్య మంత్రి ఆళ్ళ నాని జిల్లా సమీక్షకు వస్తే ఆయన ముందే వైద్య ఆరోగ్య శాఖ అవినీతిమయం అయిపోయిందంటూ ఘాటుగా కామెంట్స్ చేశారు. లంచం ఇస్తేనే తప్ప పనులు జరగడం లేదంటే ఇది మన ప్రభుత్వమేనా అని నిలదీశారు. శానిటైజేషన్ కాట్రాక్టులకు ముంబై నుంచి కాంట్రాక్టర్లకు ఇవ్వడమేంటి అని గద్దించారు.
వీటికి తగ్గట్లు ఇప్పుడు కొత్తగా ఖాళీ అవుతున్న రెండు మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలో ముందే ఫిక్స్ అయిపోయినట్లు వైసిపి వర్గాల్లో టాక్ నడుస్తుండటంతో ఈ సీనియర్ మోస్ట్ నాయకుల అసహనానికి అంతే లేకుండా పోయింది. మరి ఇలాంటి విమర్శలు చేస్తే పదవులు దక్కుతాయా లేదా పార్టీ అధినేతను ప్రసన్నం చేసుకుంటే వారిని పవర్ లో కూర్చో పెడతారా అన్న విషయం పైన ఇన్నేళ్ళ అనుభవం ఉన్న రాజకీయ నాయకులు వారికే తెలియాలి. ఈ అసంతృప్తి పరుల సమూహాన్ని జగన్ రాబోయే రోజుల్లో సరైన పద్ధతిలో డీల్ చేయకపోతే పార్టీ కేడర్ ఎక్కడికక్కడ అ విచ్ఛిన్నం కావడం కాయం. విపక్షాలు బలపడినా ఇబ్బంది లేదు కానీ వైసిపికి స్వంత పార్టీలో పరస్పర విభేదాలు మరియు అసంతృప్తి భావనలు చెలరేగితే విపరీతమైన నష్టం వాటిల్లుతుందని చరిత్రే మనకు చెబుతోంది.