AP Political News: పుకార్లే.. పక్కా గాసిప్పులే కానీ కొన్ని చదవడానికి భలే కిక్కిస్తాయి.. పొలిటికల్ పుకార్లకు సీజన్ అంటూ ఉండదు.. కాకపోతే సగం పాలన పూర్తయింది కాబట్టి.., ప్రతిపక్షం చురుకయ్యింది కాబట్టి.. ఇప్పుడిప్పుడే పుకార్ల వేడి ఎక్కువయింది.. ఏపీలో పార్టీల మార్పులు, మళ్ళీ మార్పులు.., మళ్ళీ మళ్ళీ మార్పులు సహజమే. అధికారమే పరమావధిగా కొందరు పార్టీలను సులువుగా మారుతుంటారు.. ఏపీలో కొన్ని రోజులుగా బాగా వినిపిస్తున్న పుకారుకి తోడు ఇప్పుడు కొత్తగా మరోటి మొదలయింది. ఏడాదిన్నర కిందట వైసీపీకి మద్దతు పలికిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మళ్ళీ టీడీపీలోకి వస్తారని ఓ వర్గం పుకారు సృష్టించగా.., విజయవాడకు చెందిన కీలక నేత వంగవీటి రాధా మళ్ళీ వైసీపీలోకి రానున్నారంటూ రెండు రోజుల నుండి కొత్త పుకారు షికారు మొదలెట్టింది. దీనిలో వాస్తవాలేంత..? ఆ అవకాశాలు ఏమైనా ఉన్నాయా..!? వారు ఏమంటున్నారు..? అనేది లోతుగా విశ్లేషించుకుందాం..!
AP Political News: ఎవరెవరు..? ఎందుకు..!? ఏమంటున్నారు..!?
* ఏడాదిన్నర కిందట వైసీపీలో చేరిన వల్లభనేని వంశీ టీడీపీలో చేరడానికి సంప్రదింపులు జరుపుతున్నారంటూ రెండు నెలల నుండి టీడీపీ సోషల్ మీడియాల్లో ఒక వార్త తిరుగుతుంది. పైగా “ఆయనను చేర్చుకోవద్దు. ఆయన ద్రోహి” అంటూ తిట్లు కూడా యాడ్ అవుతున్నాయి. వైసీపీలో వంశీ అసంతృప్తిగా ఉన్నారని.. ఆ నియోజకవర్గంలో గ్రూపులు ఎక్కువగా ఉండడం.., ఇటు యార్లగడ్డ వర్గం.. అటు దుట్టా రామచంద్రరావు వర్గంతో వంశీకి ఏమాత్రం పొసగడం లేదని.. అన్ని గ్రామాల్లోనూ గ్రూపులు, ఫిర్యాదులు, గొడవలు, కేసులతో వంశీ విసిగిపోయారట. జగన్ దృష్టికి తీసుకెళ్లాలన్న ఆయన కనీసం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని అందుకే వంశీ మళ్ళీ టీడీపీలోకి వచ్చేయాలని భావిస్తున్నారని టీడీపీ సోషల్ మీడియా క్రియేట్ చేసుకుని, వైరల్ చేసుకుంటుంది.. “దీనిపై వంశీ సింపుల్ గా కామెంట్ చేశారు. లోకేష్ పెయిడ్ బ్యాచ్ అలా ప్రచారం చేస్తుంది. నేను టీడీపీలోకి ఎందుకు వెళ్తాను..? వైసీపీలో కంఫర్ట్ గా ఉన్నాను” అంటూ చెప్పేసారు. తనపై జరుగుతున్నా ప్రచారానికి సింపుల్ గా చెక్ పెట్టె ప్రయత్నం చేసారు. కానీ సోషల్ మీడియా ఆగదుగా…
* మరోవైపు గత ఏడాది మార్చిలోనే టీడీపీ నుండి వైసీపీలో చేరిన మాజీ మంత్రి శిద్దా రాఘవరావు కూడా మళ్ళీ టీడీపీలోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఒక పుకారు మొదలయింది. “ఆయనకు ఉన్న గ్రానైట్ కేసులు, ఫైన్లు నుండి తప్పించుకోడానికి పార్టీ మారారన్నది నిజం. ఆయన వ్యాపారం అయితే ఇప్పుడు సవ్యంగానే సాగుతుంది. కాకపోతే రాజకీయంగా ఆయన ఏమాత్రం కంఫర్ట్ గా లేరు. సీటు లేదు, పెత్తనం లేదు. ఒక నియోజకవర్గం లేదు. ఒక పదవి లేదు. వచ్చేయి కార్యకర్తలు లేరు. పనులు అడిగే నాయకులు లేరు. పాపం… ఏడాదిన్నరలో సిద్దా తన ప్రభావాన్ని బాగానే కోల్పోయారు. టీడీపీలో ఉంటె ప్రతిపక్షంలో ఉన్నా ఒక పెద్దాయన అనే గౌరవం ఉండేది..” అందుకే ఆయన మళ్ళీ టీడీపీలోకి వచ్చే సన్నాహాల్లో ఉన్నారని పుకార్లు తిరుగుతున్నాయి. దీనిపై శిద్దా నేరుగా ఎక్కడా స్పందించనప్పటికీ.. ఆయన కుమారుడు మాత్రం తన సన్నిహితుల వద్ద మాట్లాడారట.. “అప్పుడే ఏముంది? జగన్ పరిపాలన బాగుంది. ఇది నచ్చి చేరాము. అప్పుడే పార్టీ మార్పు అని పుకార్లు రావడం ఎవరో సృష్టించినవే.. మేము కంఫర్ట్ గా ఉన్నాము” అంటూ కొట్టిపారేశారట.. కానీ శిద్దా మాత్రం ఇటువంటి పుకార్లు వినిపించినప్పుడు కాస్త చిన్నబిచ్చుకుంటున్నట్టు సమాచారం..
ఇటు నుండి అటు అంటూ…!
* ఇక వంగవీటి రాధాకృష్ణ ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. కాకపోతే రాజకీయంగా కొంచెం సైలెంట్ గానే ఉన్నారు. రెండేళ్లుగా పెద్దగా సభల్లో.., టీడీపీ సమావేశాల్లో కనిపించడం లేదు. రాజధాని గొడవల్లో కూడా రెండుసార్లు తప్ప ఎక్కడా యాక్టీవ్ గా పోరాడడం లేదు. అందుకే ఆయన టీడీపీలో అసమ్మతి, అసంతృప్తితో ఉన్నారని.. త్వరలోనే వైసీపీకి వెళ్ళిపోతారని ఒక పుకారు తిరుగుతుంది.. “నిజానికి వంగవీటి టీడీపీలో అసమ్మతిగా లేరు. సైలెంట్ గా ఉన్నారు. టీడీపీ ఆయనకు తగిన ప్రాధాన్యతని ఇస్తున్నది. కానీ స్థానిక రాజకీయ పరిస్థితులు, అధికార పక్షం దూకుడు కారణంగా ఆయన మరో ఏడాది సైలెంట్ గా ఉండాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. పార్టీ మార్పు మాత్రం పెద్ద పుకారు మాత్రమే. 90 శాతం జరగకపోవచ్చు అని ఆయన అనుచరగణం చెప్పుకొస్తుంది. ఆయన మాత్రం దీనిపై ఎక్కడ స్పందించలేదు.
* టీడీపీలో సీనియర్ నేత జ్యోతుల నెహ్రు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుండి గెలిచి, 2015 లో టీడీపీలో చేరారు. ఆ పార్టీలో మంచి హోదానే అనుభవించారు. కానీ ఇప్పుడు అసమ్మతి, అసంతృప్తితో ఉన్న మాట వాస్తవమే. ఇటీవల పార్టీలో తన పదవికి కూడా రాజీనామా చేసారు. కానీ పార్టీలో ఇంఛార్జిగా కొనసాగుతానని చెప్పారు. పార్టీలో నిర్ణయాలు, చంద్రబాబు వైఖరి, లోకేష్ తీరు నచ్చడం లేదని తన సన్నిహితుల దగ్గర వ్యాఖ్యానిస్తున్నట్టు తెలిసింది. అయితే ఈయన వైసీపీలోకి వచ్చే విషయం ధృవీకరించలేం. జగన్ ఈయనను ప్రత్యేకంగా పరిగణిస్తారు. వైసీపీలో జ్యోతుల నెహ్రూకి జగన్ మంచి ప్రాధాన్యతనిచ్చారు. పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా అవకాశం ఇచ్చారు. ఒకవేళ ఆయన పార్టీలో ఉంటే 2019 లో కచ్చితంగా మంత్రి పదవి ఇచ్చేవారు. అంతటి ప్రాధాన్యమిచ్చిన సీనియర్ నాయకుడు కూడా పార్టీని వీడడం అప్పట్లోనే జగన్ ని బాగా బాధ పెట్టిందట.. నాడు పార్టీ మారిన 23 మంది ఎమ్మెల్యేల్లో ఎక్కువగా జ్యోతుల నెహ్రు, గొట్టిపాటి రవికుమార్ విషయంలోనే జగన్ బాగా బాధపడినట్టు వైసీపీ వర్గాలు చెప్తుంటాయి. అందుకే ఆ ఇద్దరి విషయంలో జగన్ ఫోకస్ పెట్టినట్టు చెప్తున్నారు..!