Corporate Business: ఓ మనిషీ వింటున్నావా..!? చూస్తున్నావా..!? నువ్వు మనిషివేనని, వచ్చింది మనిషేనని, పోయింది మనిషేనని మర్చిపోయావా..!? ఆపదలో ఆదుకునే స్వభావాన్ని మరిచి.. ఆపదలో ఆడుకునే స్వభావాన్ని.. విపత్తిని నీకు అనుకూలంగా వాడుకునే స్వభావాన్ని అలవాటూ చూసుకున్నావా.!? శవాలతోనే వ్యాపారం మొదలు పెట్టావా..!? ఎంత ఎదిగిపోయావు మనిషి..!?
ఆసుపత్రుల్లో బెడ్లు.. అత్యవసర ఇంజెక్షన్లు.. ఆక్సిజన్ సిలిండర్లు.. ఆసుపత్రుల్లో ఫీజులు.. అన్నిటా దోపిడీ జరుగుతుంది. ఎన్ని నియంత్రణ చర్యలు తీసుకుంటున్నా ఆగడం లేదు..! పోనీ మనిషి బతికున్నప్పుడు ఈ వ్యాపారాలు.., దోపిడీ చేశారంటే ఎంతో కొంత పెట్టుకుంటారు.. కానీ…
చనిపోయిన మనిషి తరలించడానికి.. కాపలా ఉంచడానికి.., కాల్చడానికి.. కూడా భారీగా దోపిడీ.. 40 కిలోమీటర్లు మృతదేహాన్ని తీసుకెళ్లాలంటే అంబులెన్స్ కి రూ. 50 వేలు ఇవ్వాలట..చనిపోయిన మనిషిని ఐస్ బాక్స్ లో నిల్వ చేయడానికి గంటకి 3 వేలు ఇవ్వాలట.. దహన సంస్కారాలకు కట్టెలకు రూ. 5 వేలు ఇవ్వాలట.. అక్కడ కాల్చే మనిషికి 5 వేలు ఇవ్వాలట…!!
Corporate Business: ఏపీలో కాదు.. అన్నిటా ఇంతే..!!
ఇదేదో ఏపీలో పరిస్థితి. మిగిలిన అన్ని రాష్ట్రాల్లో బాగుంది అని కాదు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ ఒకటేమిటి..!? అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే తరహా పరిస్థితి ఉంది. శవాలతో వ్యాపారం మొదలయింది. కార్పొరేట్ ఆసుపత్రుల్లో దోపిడీ తరహాలో కార్పొరేట్ శవాల దోపిడీ ఆరంభమయింది. సింపుల్ గా ఒక మనిషి కరోనా సోకి ఆసుపత్రిలో చేరి వైద్యం తీసుకుని బయటకు వస్తే ఎంత ఖర్చు అవుతుంది..!? కరోనా సోకి, ఆసుపత్రిలో చనిపోతే ఎంత ఖర్చు అవుతుందో.. చూద్దాం…!
* కరోనా సోకినా వ్యక్తి టాప్ కార్పొరేట్ ఆసుపత్రిలో చేరాలంటే ముందుగా ఒక బెడ్ బుక్ చేసుకోవాలి. అందుకు రూ. లక్షన్నర డిపాజిట్ చేయాల్సిందే. ఆ డిపాజిట్ కట్టి చేరిన తర్వాత ఆసుపత్రిలో బెడ్ కి రోజుకి 15 వేలు, డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు రోజుకి రెండు వేలు, ఆక్సిజన్ రోజుకి 6 వేలు, నర్సింగ్ చార్జీలు రోజుకి 2 వేలు, నిర్వహణ చార్జీలు పేరిట రోజుకి రూ. 2 వేలు… అంటే రోజుకి 27 వేలు చెల్లించాలి. ఇవి కాకుండా మందులకు రోజుకి రూ. 15 వేలు వరకు వసూలు ఉంటుంది. పరీక్షలు, టెస్టులు పేరిట రోజుకి రూ. 10 వేలు తప్పనిసరి.. ఇలా ఒక కరోనా పేషేంట్ కరోనాతో ఆసుపత్రిలో చేరితే రోజుకి రూ. 50 వేలు వరకు ఇవ్వాల్సిందే. లేకపోతే వైద్యం అందదు. అలా పది రోజులు ఉంటె రూ. 5 లక్షలు వదులుకోవాల్సిందే. ఏ ఇన్సురెన్సులు, పాలసీలు పని చేయవు.
- * ఇదే పేషేంట్ పది రోజులు వైద్యం చేశయించుకుని బతికితే పర్వాలేదు. డబ్బు పోయిన మనిషి వచ్చారు అన్నట్టు ఉంటుంది. కానీ కొన్ని చోట్ల ఇలా వైద్యం తీసుకుంటూనే మరణిస్తున్నారు. కరీం నగర్ కి చెందిన కుమార్ యాదవ్ అనే ఓ జర్నలిస్టు… కరోనా పాజిటివ్ తో హైదరాబాద్ లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చేరారు. 11 రోజులు వైద్యం చేయించుకున్నారు. రూ. 8 లక్షలు బిల్లు అయింది. అతనికి నయం కాలేదు. ఇక డబ్బులు లేక అతన్ని హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యం పొందుతూ రెండు రోజుల్లోనే మరణించారు. అతన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి రూ. 60 వేలు అప్పు చేయాల్సి వచ్చింది. ఇలా ఆ కుటుంబం మొత్తం 6 లక్షల వరకు అప్పు చేయగా… ఆ మనిషి కూడా మిగలలేదు. * ఇటువంటి సంఘటనలు తెలుగు రాష్ట్రాల్లో అనేకం ఉన్నాయి. కదిలిస్తే కన్నీటి గాధలే మిగులుతున్నాయి..!