Jamili Elections ; దేశం మొత్తం 2022 లో ఎన్నికలు జరగనున్నాయి. “ఒకే దేశం – ఒకే ఎన్నిక (జమిలి)” ప్రక్రియలో భాగంగా బీజేపీ టార్గెట్ ఫిక్స్ చేసింది. 2014 లో కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుండి మోడీ నోటా, అమిత్ షా నోటా జమిలి జపం వినిపిస్తుంది. నిజానికి అన్నీ కలిసి వస్తే “2017 లోనే జమిలి నిర్వహించాలని మోడీ బృందం ప్లాన్ చేసారు. కానీ కుదరలేదు. అందుకే ఈ సారి పకడ్బందీగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. 2022 నవంబర్ నాటికి దేశం మొత్తం ఎన్నికలు జరగడానికి మొత్తం తెరవెనుక వ్యవహారాలు జరిగిపోతున్నాయి.! గతేడాది నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో 22 పార్టీలు జమిలి ఎన్నికలకు మద్దతు ప్రకటించాయి. ఇక అప్పటి నుంచీ ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్న కేంద్రం తాజాగా ఇందుకు సంబంధించి ఆచరణీయమైన రోడ్ మ్యాప్, ఫ్రేమ్ వర్క్ను లా కమిషన్ రూపొందించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇదే ఒక కీలక ముందడుగు..!
Jamili Elections ; లోక్ సభలో చర్చ సందర్భంగా..!!
ఇటీవల లోక్సభలో ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, వంగా గీత, మన్మె శ్రీనివాస్ రెడ్డి జమిలి ఎన్నికలకు సంబంధించి ఒక కీలక ప్రశ్న వేశారు. దీనికి సమాధానంగా కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ “జమిలి ఎన్నికలకు సంబంధించిన రూట్ మ్యాప్ అంశాన్ని ప్రస్తావించారు. ఇప్పటికే సిబ్బంది, ప్రజా సమస్యలు, న్యాయ శాఖకు చెందిన పార్లమెంటరీ స్థాయూ సంఘం జమిలి ఎన్నికలకు సంబంధించి అధ్యయనం చేయడమే కాక, ఎన్నికల సంఘంతోనూ చర్చించి తన 79వ నివేదికలో కొన్ని సిఫారసులు చేసిందని” వీటిని లా కమిషన్ పరిశీలిస్తోందని” ఆయన చెప్పారు. మూడు నెలల కిందటే ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం కూడా జమిలి ఎన్నికలకు సానుకూలంగా ప్రకటించింది. సో.. ఇక అన్ని అనుకూలిస్తే బీజేపీ మాట నెగ్గినట్టే..!
Jamili Elections ; పార్లమెంటు / అసెంబ్లీల్లో తీర్మానాలు ద్వారా..!?
జమిలి ఎన్నికలు నిర్వహణకు సంబంధించి ఒక కీలక ప్రకీర్య చట్ట సభల్లో తీర్మానాలు చేయడం. పార్లమెంటులో బిల్లు పెట్టడం, మూడొంతుల సభ్యుల మద్దతుతో తీర్మానం చేయడం బీజేపీకి పెద్ద కష్టం కాదు. రాజ్యసభలో కొంచెం కష్టం అయినప్పటికీ మూడొంతుల మద్దతు కూడగట్టడం బీజేపీకి సాధ్యమే. ఇక రాష్ట్రాల్లోనే శాసనసభల్లో ఆమోదించడం కూడా సులువే. దేశం మొత్తం మీద 29 రాష్ట్రాలకు గానూ.. 20 రాష్ట్రాల్లోని శాసనసభల్లో ఆమోదించాల్సి ఉంది. అప్పుడే ఈ తీర్మానాన్ని రాష్ట్రపతి పరిగణనలోకి తీసుకుంటారు. సో.. ఇవన్నీ బీజేపీకి కష్టం కాదు. ప్రస్తుతం దేశంలోని 17 రాష్ట్రాలు బీజేపీ పాలితంగానే ఉన్నాయి. కేసీఆర్, నవీన్ పట్నాయక్, కేజ్రీవాల్, జగన్ లాంటి వాళ్ళు కూడా జమిలికి సిద్ధంగానే ఉన్నట్టు తెలుస్తుంది. సో.. జమిలి నిర్వహణకు బీజేపీ మాట ప్రకారం అన్నీ కలిసి వస్తున్నట్టే సమాచారం.
ఈ రాష్ట్రాల్లో పొడిగించే అవకాశం..!!
ఇక జమిలి సంగతి పక్కన పెడితే.. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ లో పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. మూడు నెలల కిందటే బీహార్ ఎన్నికలు జరిగాయి. ఒకవేళ వచ్చే ఏడాది చివర్లో ఎన్నికలు అంటే ఈ రాష్ట్రాల్లో కనీసం రెండేళ్లు పదవి కలం కూడా పూర్తవ్వదు. అందుకే జమిలిలో ఒక నిబంధన ప్రకారం “అసెంబ్లీ ఏర్పడి రెండున్నరేళ్లు లోపు అయితే అక్కడ 2022 లో జమిలి నిర్వహించరు. మళ్ళీ 2027 నాటికీ నిర్వహించనున్నారు. అంటే ఆయా అసెంబ్లీల్లో గెలిచిన పార్టీలకు ఏడాదిన్నర వరకు పొడిగింపు అవకాశాలు లేకపోలేదు. మొత్తానికి వచ్చే ఏడాది చివరికి జమిలి ఎన్నికలు ఎలాగైనా నిర్వహించాలని కేంద్రం పట్టుదలతో ఉండడం.. తెరవెనుకా, ముందు అన్ని తతంగాలు చేసేస్తుండడం కూడా జమిలి వైపునకు దేశాన్ని పరుగులు పెట్టిస్తున్నట్టే..!!