YSRCP: 15 నెలల కిందట “రూ. 5 కోట్ల హవాలా నగదు” మరక.. అది పూర్తిగా వదలక మునుపే “జిల్లాలో గ్రానైట్ అక్రమాల” మరక.. ఇది పెద్దదవుతున్న దశలోనే.. రాష్ట్రంలో ట్రూ అప్ చార్జీల (True Up Charges) అంశం రగులుతుండగా టీడీపీ (Telugu Desam Party) ఎమ్మెల్యేతో కలిసి “రష్యా టూరు” మరక.. ఇవన్నీ చాలవన్నట్టు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో వేలు పెట్టడం, పెత్తనం చెలాయించడం, వివాదాలకు కారణమవ్వడం.. సొంత పార్టీ ఎంపీతో పేచీలతో ఆ మంత్రి రాష్ట్రంలోనే చర్చనీయాంశమయ్యారు.. సీఎం జగన్ (YS Jagan) కి దగ్గరి బంధువు, పార్టీలో కీలక నేత కావడంతో ఎవ్వరూ పెద్దగా ఎత్తి చూపిన సందర్భాలు లేవు, ఫిర్యాదులు లేవు.. కానీ రష్యా వెళ్లి వచ్చిన తర్వాత మాత్రం కొన్ని అంతర్గత మార్పులు కనిపిస్తున్నాయి. ఆయన మాటల్లో అనూహ్యంగా మార్పులు మొదలయ్యాయి. వైఖరి కాస్త నెమ్మదించింది, గడిచిన రెండేళ్లలో తాను తయారు చేసుకున్న శత్రువులతో కొత్త బంధం వెతికే పనిలో ఉన్నట్టే కనిపిస్తుంది.. ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రి, సీఎం జగన్ (YS Jagan Mohan Reddy) కి మామయ్య అయ్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తతంగం ఏమిటో కాస్త లోతుగా చూద్దాం..!
YSRCP: మంత్రి ఎలా మారారంటే..!?
మంత్రి మారారు అంటే కొన్ని ఆశ్చర్యాలు వ్యక్తమవ్వొచ్చు..! ఆయన ఎంతలా మారారంటే.. * “సొంత పార్టీలోనే తాను శత్రువుగా భావించే ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పుట్టిన రోజుకి స్వయానా వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో కూడా పెట్టించారు. ఇదే మంత్రి 2020, 2019 లో మాగుంట పుట్టిన రోజుకి హాజరవలేదు, కనీసం శుభాకాంక్షలు కూడా తెలియజేయలేదన్నమాట.., పైగా తన వర్గీయలు ఎవరైనా వెళ్తే వాళ్లకు క్లాస్ పీకేవారు..! కానీ మొన్న 15వ తేదీన జరిగిన పుట్టినరోజుకి మాత్రం స్వయానా వెళ్లారు, మాట్లాడారు, పుష్పగుచ్ఛం ఇచ్చారు, కేకు తినిపించారు. గత రెండేళ్లలో లేని స్నేహం, ప్రేమ, సాన్నిహిత్యం ఈ ఏడాది మాత్రమే ఎందుకు వచ్చి ఉండొచ్చు..!?
* ఇటీవల ఒంగోలులో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. “సంక్రాంతి తర్వాత మంత్రివర్గంలో మార్పులు ఉంటాయి. అందర్నీ తీసేస్తారట. సీఎం గారు చెప్పారు.. కొత్త మంత్రులను నియమిస్తారట. మంచిదే అన్నాను. కొత్త వాళ్లకు అవకాశం వస్తుంది. పదవి పోయినా నాకేం భయం లేదు. తప్పు చేస్తేనే భయపడాలి” అన్నారు. మంత్రి పదవి పోతే బాధ ఉండాలి, లేదా సంతృప్తిగా ఉంది అనాలి.. కానీ భయం లేదు, తప్పు చేయలేదు అనడం వెనుక “గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్న” కథ గుర్తుకుతెచ్చుకోవచ్చు..
* తన వాళ్ళతో ఎక్కువగా మాట్లాడుతున్నారు. ప్రత్యర్థులకు సవాల్ చేస్తున్నారు. “దమ్ముంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే పోటీ చేయాలి. కలిసి పొత్తుతో పోటీ చేస్తే ఏం లాభం” అంటూ సవాల్ చేస్తున్నారు. దీనిలో కూడా కొన్ని గమ్మత్తులు ఉన్నాయి. టీడీపీ – జనసేన పొత్తు ఉంటుందని వాళ్ళు ప్రకటించలేదు. ఆ పరంగా మార్పులు కూడా జరగడం లేదు. కానీ మంత్రి మాటల్లో పైకి దూకుడు ఉన్నప్పటికీ.. లోలోపల ఒక అభద్రతా కనిపిస్తుంది. సవాల్ అంటే “దమ్ముంటే కలిసి పోటీ చేసి నా పై గెలవండి, ఒంగోలులో నన్ను ఓడించే సత్త మీకు” లేదు” అనేలా ఉండాలి. కానీ మీరు సింగల్ గా రండి అని కండీషన్ పెట్టి సవాల్ చేయడం ఒక పెద్ద గమ్మత్తు.. అలా రష్యా టూరు నుండి వచ్చాక మంత్రి మాటల్లో మతలబులు, అంతరాలు, జిల్లాలో అసందర్భ సఖ్యతలు ఉంటున్నాయి..
రష్యా టూరు తర్వాత ఏమయ్యుంటుంది…!?
గత నెలలో రాష్ట్రం మొత్తం ట్రూ అప్ చార్జీల పెంపుతో మార్మోగుతున్న వేళ.. వైసీపీ ఇరుకున పడుతున్న సమయాన.. వినాయక చవితి సంబరాలు చేసుకునే క్రమంలో ఆ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రష్యా వెళ్లారు. టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ సహా.. ఏపీ, తెలంగాణకు చెందిన కొందరు ప్రముఖ రాజకీయ, ఆర్ధిక పెద్దలు 12 మందితో కలిసి టూరు వేశారు. అది ఆయన వ్యక్తిగతం, పూర్తిగా సొంత వ్యవహారం.. వెళ్లే ముందు పార్టీ పెద్దలకు చెప్పే వెళ్లారట…! కాకపోతే ఫ్లయిట్ లో ఉన్న ఫోటో షేర్ చేయడం.., మీడియాతో మాట్లాడే సందర్భంలో “ఇది నా సొంత టూరు, టీడీపీ ఎమ్మెల్యే కూడా వచ్చారు, ఏం మంత్రి అయితే వెళ్లకూడదా..!?” అని ప్రశ్నించడంతో వివాదం మలుపులు తిరిగింది. బాధ్యతలేని.. ప్రతిపక్ష ఎమ్మెల్యేతో బాధ్యతాయుత మంత్రి ఎలా వెళ్తారు..? తన శాఖలో ట్రూ అప్ చార్జీల గోల పెద్దదవుతున్న వేళ ఎలా వెళ్తారు..? పైగా ఇంతలా ఎందుకు సమర్ధించుకుంటున్నారు..? అంటూ పార్టీ పెద్దల్లో కాస్త ఆగ్రహం రేగింది. మంత్రి వచ్చిన తర్వాత “కొన్ని తరగతులు” నిర్వహించినట్టు తెలుస్తుంది.. ఆ తర్వాత అనూహ్యంగా మంత్రితో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది..!
మరకలు – చురకలు..!!
మంత్రి బాలినేని ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం తిరుగులేని నేత. 12 నియోజకవర్గాల్లో కూడా శాసిస్తున్నారు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు, ఇంచార్జిల ప్రమేయం లేకుండానే పనులు, బదిలీలు చేయించేస్తున్నారు. సీఎం జగన్ సన్నిహితుడు కావడం, పార్టీలో ముఖ్య నేత కావడంతో ఏ నాయకుడూ బయటకు ఏమి అనలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఆయనపై కొన్ని అవినీతి మరకలు కూడా వచ్చాయి. సుమారుగా 15 నెలల కిందట… ఒంగోలుకు చెందిన బాలు అనే బంగారు వ్యాపారి దగ్గర రూ. 5 కోట్ల నగదు తమిళనాడు పోలీసుల తనిఖీల్లో దొరికింది. ఇది మంత్రి బాలినేనిదే అంటూ ప్రతిపక్షాల నుండి ఆరోపణలు వచ్చాయి. దాన్ని ఆయన ఖండించారు. కానీ ఆరోపణల మరకలు వీడలేదు..
* టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జిల్లాలో గ్రానైట్ అక్రమాలు విచ్చలవిడిగా జరిగాయి. దీనిపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించి.. సీఎం జగన్ ప్రత్యేక ఆదేశాలతో అవినీతిని కట్టడి చేసే పనిలో అధికారులు ఉన్నారు. కానీ జిల్లాలో ప్రతిపక్ష నాయకులకు చెందిన కొన్ని గ్రానైట్ క్వారీలను మంత్రి బాలినేని అనుచరులు కొనుగోలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చగా ఉంది. ఓ టీడీపీ ఎమ్మెల్యేకు చెందిన క్వారీని రూ. 22 కోట్లకు.. ఓ నియోజకవర్గ టీడీపీ ఇంచార్జికి చెందిన 14 ఎకరాల డంపింగ్ క్వారీని కొనుగోలు చేసినట్టు చెప్పుకుంటున్నారు..
* గత నెలల్లో రష్యా వెళ్లి వచ్చారు. కొన్ని వ్యక్తిగత పనుల నిమిత్తం.. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేతో కలిసి వెళ్లడం ఒక వివాదానికి దారి తీసింది. జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో బాలినేని వర్గీయుల ద్వారా కీలక పనులు జరిపిస్తున్నట్టు చర్చ జరుగుతుంది.. ఇలా భిన్నమైన అంశాల్లో బాలినేని తీరుపై అధికార పార్టీ వర్గాల్లో చర్చ ఉండగా.., పార్టీ పెద్దల్లో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నట్టు తెలుస్తుంది. వాటి నేపథ్యమే ఇటీవల బాలినేనిలో మార్పు వచ్చిందనీ.., సైలెంట్ అయ్యారని.. అందర్నీ కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారని జిల్లాలోని అధికార పార్టీ వర్గాల్లో అంతర్గత చర్చ జరుగుతుంది..!