Andhra Pradesh ; ఏపీకి గవర్నర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ వస్తే..!? ఆహా..! వస్తే ఎలా ఉంటుంది.., ఏమవుతుంది..? పర్యవసానాలు ఎలా ఉంటాయి..!? ఓ సారి ఆలోచించండి..!!
ఏపీకి ఎన్నికల కమీషనర్ గా అజయ్ కళ్ళం వస్తే..!? ఆహా..! వస్తే ఎలా ఉంటుంది.., ఏమవుతుంది..? పర్యవసానాలు ఎలా ఉంటాయి..? ఓ సారి ఆలోచించండి..! ఈ రెండు ఏమిటో, వాటి నిజానిజాలు ఏమిటో లోతుగా చర్చించుకుందాం..!!
కొన్ని పుకార్లు భలే గమ్మత్తుగా ఉంటయ్.. కొన్ని ప్రచారాలు వినడానికి హాయిగా ఉంటయ్.. కొన్ని గాసిప్పులు నిజం కాకపోయినా చెప్పుకోడానికి.., మాట్లాడడానికి ఆసక్తిగా ఉంటయ్..! అటువంటివే మనం పైన చెప్పుకున్నవి కూడా. ఏపీలో డిజిటల్ మీడియా సాక్షిగా మస్తు ప్రచారంలో ఉన్న పుకార్లు ఇవే. టీడీపీ అనుకూల డిజిటల్ మాధ్యమాల్లో ఏపీకి గవర్నర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేరుని కేంద్రం పరిశీలిస్తుంది.. అంటూ ఒక పుకారుని వార్తలుగా రాస్తుండగా.., వైసీపీ అనుకూల డిజిటల్ మాధ్యమాల్లో అజయ్ కళ్ళం ఏపీలో ఎన్నికల కమీషనర్ గా రాబోతున్నారు అంటూ.. ఒక పుకారు షికారు చేస్తుంది. ఇప్పుడు ఇవి జరుగుతాయా..? వీటిలో లోతైన అవకాశాలు, అంశాలు ఏమిటి..!? అనేది మనం చూద్దాం..!!
Andhra Pradesh ; బీజేపీ ఏపీలో అంత పని చేస్తుందా..!?
నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ నెలాఖరుతో పదవీ విరమణ చేయబోతున్నారు. నిమ్మగడ్డ అంటే ఏపీలో ఒక బ్రాండ్. ప్రభుత్వంతో పోరాడి.., సీఎం జగన్ ని ఢీ కొట్టి.., వైసీపీ నేతలను విసిగించి.. మొండిగా, లాజిక్కుగా, డీసెంట్ గా తాను అనుకున్నది సాధించారు. పంచాయతీ ఎన్నికలు పెట్టేసారు. మున్సిపల్ ఎన్నికలు పెట్టేసారు. పరిషత్ ఎన్నికలు కూడా పెట్టేసేవారే.., కాకపోతే న్యాయపరమైన అంశాలు మరీ ఇబ్బంది కరంగా మారడంతో వదిలేసారు. జగన్ కీ నిమ్మగడ్డకి వ్యక్తిగతంగా కూడా ఏ మాత్రం పొసగదు. ఆ కారణాలు అన్ని మనకు తెలిసినవే. ఇప్పుడు ఏపీలో బీజేపీకి సరైన నాయకులు లేరు. మాట్లాడే వారు లేరు, పనులు చక్కబెట్టేవారు లేరు, రాజకీయాలు నేర్పరితనంతో చేసేవారు లేరు.. అందుకే బీజేపీ ఒక మంచి నాయకుడి అన్వేషణలో ఉంది..! నిమ్మగడ్డ ఏపీలో సీఎం జగన్ ని ఇబ్బంది పెట్టారు అంటే ఆయనకు కేంద్ర పెద్దల నుండి ఎంతో కొంత భరోసా ఉండే ఉంటుంది.. లేకపోతే ఇంత డేర్ చేయలేరు.. (గత ఏడాది పార్క్ హయత్ లో తన సామాజికవర్గ బీజేపీ నేతలతో మీటింగులే అందుకు సాక్ష్యం) సో.., నిమ్మగడ్డ బీజేపీకి దగ్గరవ్వడం సులువు.., ఆపై మంచి స్కిల్, సబ్జెక్టు ఉంది కాబట్టి గవర్నర్ పదవి తెచ్చుకోవడం ఆయనకు కష్టం కాదు. కాకపోతే బీజేపీతో ఫ్రెండ్లిగా ఉన్న జగన్ కి వ్యతిరేకంగా ఉన్న ఈ వ్యక్తిని గవర్నర్ గా వేయాల్సిన అవసరం బీజేపీకి ఏముంది..!? అనేదే పెద్ద ప్రశ్న..!! అందుకే ప్రస్తుతానికి ఇది పుకారు మాత్రమే..!!
అజయ్ కళ్ళం కి ఆ ఛాన్స్ ఉందా..!?
ఇక ఏపీ ఎన్నికల కమీషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ నెలాఖరున రిటైర్ కాబోతున్నారు. ఆయన స్థానంలో ఒక విశ్రాంత ఐఏఎస్ ని నియమించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. ఇప్పటికే నిమ్మగడ్డ తర్వాత నీలం సాహ్ని ఆ పదవిలోకి వెళ్తారు అంటూ కొన్ని పుకార్లు ఉన్నాయ్. ఇప్పుడు తాజాగా అజయ్ కళ్ళం పేరు వినిపిస్తుంది. ఈయన రిటైర్ ఐఏఎస్.., మంచి సబ్జెక్టు ఉన్న.. సీఎం జగన్ కి అత్యంత సన్నిహిత విశ్రాంత అధికారి. ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్నారు. ఎలాగూ విశ్రాంత ఐఏఎస్ లు కావాలి కాబట్టి… నీలం సాహ్ని కో.., అజయ్ కళ్ళంకో ఇస్తారు అనడంలో పెద్దగా సందేహాలు లేవు. కాకపోతే ఈ ఇద్దరే కాకుండా ఇంకా అనేక మంది జగన్ వద్ద పోటీలో ఉన్నారు. అజయ్ కళ్ళం కి ఇప్పటికే సలహాదారు పదవి ఇచ్చారు. ఆయనపై సీఎం జగన్ కి పెద్దగా ఫోకస్ లేదు అంటున్నారు. కొన్ని పరిమిత వ్యవహారాలకు మాత్రమే ఆయన్ను వాడుతున్నారు. ఆయన సలహాలు తీసుకోవడం లేదు. కొన్ని పిర్యాదులు కూడా ఆయనపై సీఎం వద్దకు వెళ్లాయి. సో.., ఎన్నికల కమీషనర్ వంటి కీలకమైన హోదా కట్టబెడతారా..!? వేరెవ్వరికైనా ఇస్తారా..?? అనేది సీఎం జగన్ చేతుల్లో ఉంటుంది..! ప్రస్తుతానికి అజయ్ కళ్ళంకి ఇవ్వనున్నారు అనేది కూడా పుకారే..!!