చైనా అంటే ఆర్ధిక శక్తి… సాంకేతిక యుక్తి… కమ్యూనిష్టు భక్తి… యుద్ధం పట్ల రక్తి… అన్ని కలగలిసిన ఆధునిక పేద్ద దేశం..!!
అమెరికాని తలదన్ని.., ఇండియాని ఓడించి.., రష్యాని కాదని.., జపాన్ ని మరిపించి.., తను ఏమిటో నిరూపించుకోవలన్న తహతహ ఏనాటి నుండో ఉంది. అందుకే గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంప్యూటర్ల సాఫ్ట్ వేర్ లను అమెరికా అందిస్తే…, స్మార్ట్ టివిల రంగంలో జపాన్ దూసుకెళ్తుంటే… స్మార్ట్ ఫోన్ ల రంగంలో మాత్రం ప్రపంచాన్ని చైనా తన గుప్పిట్లో పెట్టేసుకుంది.
ఇక ఇప్పుడెందుకు ఈ విషయం అంటే..! చైనా యాప్స్ ని మన దేశం బహిష్కరించింది. 59 యాప్స్ ని వాడకూడదు అంటూ ఆర్డర్స్ వేసింది. దీని వలన మనకు కలిగే లాభం ఏమిటి..? చైనా వారికి కలిగే నష్టం ఏమిటి అనేది చూద్దాం. ముందుగా చెప్పుకోవాలంటే చైనా యాప్స్ ని బహిష్కరించి ఉద్దేశం మాత్రం వారి ఆర్థికం దెబ్బ కొట్టాలని కాదు. రక్షణ, దేశ భద్రత దృష్ట్యా చేశారు. అంటే మనం ఇంస్టాల్ చేసుకున్న యాప్స్ తో వాళ్లు మన దేశ రహస్యాలను కనిపెట్టేస్తున్నారని.., మన మొబైల్స్ లో వారి యాప్స్ ఉంటే హాని తప్పదని ఈ నిర్ణయం తీసుకుంది.
తెలివైన “యాపా”రం…!!
టిక్ టాక్ అనే యాప్ వస్తుందని.., దానికి బందీ అవుతామని ప్రపంచంలో ఏ ఒక్కరూ ఊహించి ఉండరు. కానీ 2016 నాటికి అది ప్రపంచాన్ని చుట్టేసింది. 2018 నుండి పీక్స్ లో ఉంది. రోజుకి 2 కోట్ల మంది ఆ యాప్ ని కొత్తగా ఇంస్టాల్ చేసుకునే దశకు చేరుకుంది.
* టిక్ టాక్ కి జనం బానిసగా మారడంతో దానిలో ఫాలోయర్లు రానివారికి.., అటువంటిదే మరో లైకీ, హెలో అనే యాపులను దించింది. ఇవి కూడా పాపులర్ అయిపోయాయి. ఇక గ్లోబల్ సెల్ యుగం మొత్తం చైనా చేతిలోకి చేరింది.
* ప్రపంచంలోని స్మార్ట్ ఫోన్లలో 69 % ఫోన్ లలో ఈ టిక్ టాక్ అనే యాప్ ఉంది. ఇప్పటికీ రోజు ఇంస్టాల్ చేసుకుంటూనే ఉన్నారు. ఓ లెక్క ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 920 మిలియన్ల మంది టిక్ టాక్ వాడుతున్నారు. యాప్ ల ద్వారా వచ్చే ఆదాయంలో దీనిదే అగ్రభాగం.
* ఇక యూసీ బ్రౌజర్…, లైకీ.., కామ్ స్కానర్.., హెలో వంటి కొన్ని యాపులను ప్రపంచం పైకి వదిలింది. వీటికి కొందరిని బానిసలుగా మార్చింది. ఈ యాపులను కూడా దాదాపు 650 మిలియన్ల మంది వాడుతున్నారు. అంటే ప్రపంచ యాప్ మార్కెట్లో చైనా యాప్ ల వాటా సుమారుగా 43% అన్నమాట. ఇంతగా యాప్ యాపారంలోకి చైనా రాజుగా మారింది.
ఇండియా వాటా ఏమిటీ…!!
అబ్బో… పక్క దేశం.., చవకగా వదిలిన దేశం.. చైనా వాడికి, వారి ఉత్పత్తులకు మొదటి నుండీ అతిపెద్ద మార్కెట్ మనమే. 2006 లో మొదట ఇండియాలోకి చైనా ఫోన్ వచ్చింది. అప్పట్లో స్మార్ట్ ఫోన్ అంటే అదో వింత. ఆ సమయంలో ఇండియాలో సెల్ ఫోన్ ల వాడకం బాగా విస్తరిస్తున్న సమయంలో చైనా ఫోన్లు దించి.., చవకగా అలవాటు చేసి.., ఆ ఫోన్లలో రేడియో, పాటలు, సినిమాలు వచ్చేలా తయారు చేశారు. ఇహ మొదలయ్యింది చైనా ఫోన్ల పిచ్చి. 2012 వచ్చే సరికి పూర్తి ఆధిపత్యం వాళ్లకు వెళ్ళింది. జియోమి అనే కంపెనీకి మన దేశమే అతి పెద్ద మార్కెట్. ఆ కంపెనీ ఉత్పత్తుల్లో ఇండియాలోనే 51 % అమ్ముతుంటారు. అక్కడి నుండి ఫోన్లు, యాపులు.., మనదేశంపై వదలడంతో .. మనం అలవాటు పడడం జరిగిపోయింది.
* ప్రస్తుతం టిక్ టాక్ లో గ్లోబల్ మార్కెట్లో మన వాటా 22% . యాప్ చైనా వారిది, యాపారం మనది. యూసీ బ్రౌజర్ లాంటి వేరే యాపులను కూడా మనమే బాగా ఆదరించాం. అన్నీ కలుపుకుంటే ఇప్పుడు మన దేశం చైనాకి సంబంధించిన 59 యాపులను బహిష్కరించింది. వాటిని మన దేశంలో సుమారుగా 28 కోట్ల మంది వాడుతున్నారు. వీటికి ప్రత్యామ్నాయం కూడా కేంద్రం చూపిస్తుంది. ఇది చైనాకు తాత్కాలిక దెబ్బ మాత్రమే. వాళ్ళ యాప్ యాపారంలో 22% నుండి 26% దెబ్బతింటుంది. చైనా మళ్ళీ ఈ దెబ్బ నుండి కొలుకోగలదు. కానీ చైనా ఉత్పత్తులను నిలిపివేస్తే మాత్రం సగానికి సగం చైనా మొబైల్ విపణి విలవిల్లాడుతుంది.
Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!