పోలీసు ఆఫీసర్గా ఉంటూ.. అప్పటి అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపైనే మీసం మెలేసి.. అనంతరం రాజకీయాల్లోకి వచ్చి.. ఆపై వైసీపీ తరఫున పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు గోరంట్ల మాధవ్! కష్టపడి పైకొచ్చిన వ్యక్తి.. సామాన్యుడి కష్టసుఖాలు తెలిసిన వ్యక్తి.. తమకు అన్ని రకాలుగా ధైర్యంగా నిలబడే వ్యక్తి.. అని నమ్మిన ప్రజలు మాధవ్ కు ఓటేశారు. మొదట్లో కూడా ఆయనకు నియోజకవర్గంలో రాజకీయంగా మంచి పేరే వచ్చింది కూడా. అయితే… తాజాగా మాధవ్ పై విమర్శల వర్షాలు పెరిగిపోతున్నాయి. స్వయంకృతాపరాధం కూడా ఉందనీ వినిపిస్తున్న ఆ వాదనలను ఇప్పుడు తెలుసుకుందాం..
పోలీసుగా పనిచేస్తూ పనిచేస్తూ రాజకీయాల్లోకి వచ్చినందుకో ఏమో కానీ… గోరంట్ల మాధవ్ లో ఇంకా పోలీసు లక్షణాలు పోలేదని, ఫలితంగా కాస్త దురుసు ప్రవర్తన, కరుకు మాటలు వంటివి ఆయనను ప్రజలకు దూరం చేస్తున్నాయని అంటున్నారు. దురుసు ప్రవర్తనా, కరుకు మాటలు, దూసుకుపోయే తత్వం పోలీసుకు అవసరమే కావొచ్చు కానీ.. ప్రజాప్రతినిధికి కాదనే విషయం గమనించడంలో మాధవ్ ఫెయిలయ్యారని అంటున్నారు. పోలీసుగా మంచిపేరు తెచ్చుకోవడానికి అవి ఉపయోగపడతాయోమో కానీ.. ప్రజాప్రనిధిగా ప్రజల్లో మంచి పేరుతెచ్చుకోవడానికి ఆ దురుసు ప్రవర్తన అంతగా సూటవ్వదని చెబుతున్నారు.
పార్లమెంటులో గళం వినిపించడంలో వెనుకబడిపోయారని, ఇటీవల లోక్సభ విడుదల చేసిన ఎంపీల ఏడాది ప్రోగ్రెస్ రిపోర్టు ఈ విషయాన్ని స్పష్టం చేస్తుందని నియోజకవర్గంలో ప్రత్యర్థుల నుంచి ఆరోపణలు మొదలైపోయాయి. దీంతో టీడీపీ మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప ప్రజల్లోకి వెళ్తున్నారని అంటున్నారు. తన ఆలోచన మొత్తం జేసీ వర్గంపై పైచేయి సాధించడం మీదే పెట్టారు తప్ప… వెనకపడిన హిందూపురం ప్రాంతానికి ఏమి చేయాలనే దిశగా లేదని అంటున్నారు.
ఎంపీ అయిన ఏడాదిలోనే ఇన్నిరకాల ఆరోపణలు ఎదుర్కొంటున్న దశలో… మాధవ్ ఇప్పటికైనా మారతారా లేదా అనే విషయం ఆయ్యనకే వదిలేస్తున్నారంట నియోజకవర్గ ప్రజలు. కొత్త కదా అలనే ఉంటుంది.. ఇకపై అర్ధం చేసుకుని సర్ధుకుపోతాడని కొంతమంది ఆశాభావం వ్యక్తం చేస్తుంటే… అర్థం చేసుకోని పక్షంలో ఆయనకే అనర్ధం అని మరికొందరు అంటున్నారట!! వింటావా మాధవా?