ఫలితాల్లో ఉత్తీర్ణత తగ్గి ఉండొచ్చు గాక…, ప్రభుత్వ కళాశాలల్లో కూడా ఉత్తీర్ణత పడిపోవచ్చు గాక.., గత ఏడాదితో పోలిస్తే 9 శాతం తగ్గి ఉండొచ్చు గాక…! ఇవన్నీ చదువులు తగ్గాయి అనే ఆందోళన కంటే చదువుల్లో చీకటి తగ్గింది అనే సంతోషం ఉండాల్సిన తరుణం ఇది. ఆ చీకటి ఏమిటి…? చదువుల విషయంలో వచ్చిన మార్పులేంటి..? పరీక్షల్లో, ఫలితాల్లో ఈ మార్పులు దేనికి సూచికం అనేది ఆసక్తికరమే. అదేంటో తెలుసుకోవాల్సిందే. అందుకే ఇంటర్ పరీక్షల్లో, ఫలితాల్లో గతంలో ఏం జరిగేది…? ప్రస్తుతం ఏం జరిగింది…? ఈ మార్పుల ఫలితాలు భవిష్యత్తులో ఎలా ఉండనున్నాయి…? అనే విషయమై లోతుగా “న్యూస్ ఆర్బిట్” ప్రత్యేక కథనాలు అందిస్తుంది. ఇది మొదటిది.
9 శాతం తగ్గుదల…!!
ఇంటర్ ఫలితాల్లో గడిచిన అయిదేళ్లలో ఏ ఏడూ 70 శాతానికి ఉత్తీర్ణత తగ్గలేదు. గడిచిన ఐదేళ్లలో చూసుకుంటే 2019 లో 72 శాతం, 2018 లో 73 . 33 .., 2017 లో 77 .., 2016 లో 73 . 78 .., 2015 లో 72 శాతం ఉత్తీర్ణత ఉండేది. అంటే ఈ ఏడాది తగ్గింది. ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో… రెండిట్లో తగ్గుదల స్పష్టంగా ఉంది. స్వేచ్ఛగా వదిలేసే ప్రభుత్వ కళాశాలల్లో తగ్గుదల 20 శాతం వరకు ఉంటె.., ప్రైవేట్ , కార్పొరేట్ కళాశాలల్లో కుడా తగ్గుదల 12 శాతం వరకు ఉంది. గడిచిన ఎనిమిదేళ్లలో ఏ నాడు కార్పొరేట్ కళాశాలల్లో ఇంతలా ఉత్తీర్ణత తగ్గలేదు. అక్కడే ఉంది చీకటి కోణం మొత్తం.
పత్రికలూ చెప్పని వాస్తవాలు…!
అవును. పత్రికలూ చాలా వాస్తవాలు చెప్పలేదు. ఈనాడు, ఆంధ్ర జ్యోతి వంటి పత్రికల్లో ఉత్తీర్ణత తగ్గింది అంటూ కన్నీటి కథలు అల్లేలా కథనాలు వచ్చాయి.., సాక్షి లో పైపైన కొంత ఇచ్చారు, కానీ చీకటి కోణం చెప్పలేదు.
* ఉన్నపళంగా ఉత్తీర్ణత తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయి. మొదటిది మాత్రం చూచి రాతలను పూర్తిగా అరికట్టడమే. గతంలో ప్రభుత్వ కళాశాలల్లోనూ.., ప్రైవేట్ కళాశాలలోనూ ఇవి సమాంతరంగా జరిగేవి. ప్రభుత్వ కళాశాలల్లో 30 శాతం మార్కులకు జరిగితే, ప్రైవేట్ కళాశాలల్లో విద్యార్థులకు 45 నుండి 50 శాతం వరకు మార్కులు అదనంగా వచ్చేలా చూచి రాతలు జరిగేవి.
* ప్రైవేట్ కళాశాలల్లోనూ… కార్పొరేట్ కళాశాలలు పరీక్షలను, ఫలితాలను శాసించేవి. జంబ్లింగ్ విధానం వచ్చినా ముందస్తుగా వారు అనుకున్న కళాశాలలోనే తమ విద్యార్థులు ఉండేలా చక్రం తిప్పేవారు. అలా ప్రతి కార్పొరేట్ కళాశాల కూడా వంద శాతం ఫలితాలు, ర్యాంకులు సాధించేవి. ఈ ఏడాది మాత్రం నారాయణ, శ్రీ చైతన్య, వంటి కళాశాలల్లో కూడా పది నుండి 15 శాతం విద్యార్థులు ఫెయిల్ అయ్యారు.
* మొదటి ఏడాదిలో 68 శాతం మార్కులతో పాసైన ఓ విద్యార్థి, రెండో సంవత్సరం కనీసం 30 శాతం మార్కులు కూడా తెచ్చుకోలేక ఫెయిల్ అయ్యారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది విద్యార్థులు బోల్తా పడ్డారు. గత ఏడాది చూచిరాతలకు అవకాశం ఇచ్చి, ఈ ఏడాది లేకపోవడంతో ఆకస్మికంగా ఫలితం తేడా కొట్టింది.
* ఇవన్నీ పత్రికల్లో చెప్పలేదు. కార్పొరేట్ కళాశాలల చేతుల్లో ప్రభుత్వాలు ఎలాగో పత్రికలూ కూడా అదే స్థాయిలో భాగస్వాములుగా ఉన్నాయి. ప్రతి పత్రికకు ఏటా నారాయణ, శ్రీ చైతన్య వంటి సంస్థల నుండి ఏడాదికి రూ. 50 నుండి 60 కోట్ల విలువైన ప్రకటనలు వచ్చేవి. అందుకే ఈ కళాశాలల్లో జరిగే చీకటి కోణాలు బయటకు వచ్చేవి కాదు.
(ఇక ఈ చదువుల మార్పు ఫలితాలు, ఉత్తీర్ణత తగ్గడం వలన కలిగే ఎదురయ్యే పరిణామాలు, ప్రభుత్వ కళాశాలలకు జరిగే ప్రయోజనాలపై మరో కథనంలో చెప్పుకుందాం)