2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు పరిస్థితి ఏమిటో..! ఇప్పుడు తెలంగాణలో కేసిఆర్ పరిస్థితి అలాగే ఉందని సరిగ్గా అర్ధం చేసుకోవాలి. 2019 ఎన్నికలకు ముందు కూడా చంద్రబాబు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని లెక్క చేయలేదు. నరేంద్ర మోడీ పని అయిపోయింది. నరేంద్ర మోడీ అమిత్ షాల పై పర్సనల్ గా వెళ్లారు. మోడీని పర్సనల్ గా టార్గెట్ చేశారు. దేశంలో బీజేపీ పని అయిపోయింది అంటూ బీజేపీ వ్యతిరేక శక్తులతో చంద్రబాబు చేతులు కలిపారు. రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, శరద్ పవార్ లాంటి వాళ్లతో చేతులు కలిపి రాజకీయం చేశారు. అలా వెళ్లి చంద్రబాబు ఫెయిల్ అయ్యారు. చంద్రబాబు అనూహ్యంగా బీజేపీని టార్గెట్ చేయడం, మరో పక్క కేసిఆర్ ను టార్గెట్ ను చేయడం, ఏపిలో జగన్మోహనరెడ్డిపై సానుభూతి ఉండటం ఇవన్నీ కలిసి వచ్చి చంద్రబాబు దారుణమైన ఓటమిని మూటగట్టుకున్నారు. ఆ తరువాత బీజేపీకి వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడలేక బీజేపీకి అనుకూలంగా కూడా మాట్లాడలేక మధ్యస్తంగా ఉండిపోయారు. ప్రస్తుతానికి బీజేపీకి అనుకూలమా..? వ్యతిరేకమా..? న్యూట్రల్ అనేది తేల్చుకోలేక పోతున్నారు చంద్రబాబు. ఈ విషయాలను పక్కన బెడితే..
ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే .. కేసిఆర్ బీజేపీ అంటే కయ్యానికి కాలు దువ్వుతున్నారు. నరేంద్ర మోడీ పని అయిపోయింది. మోడీ ఒక రాజ్యాంగేత శక్తి, ఒక కార్పోరేట్ శక్తి, ఆయనకు పరిపాలన తెలియదు. ఆయన చేతగాని పీఎం అంటూ పర్సనల్ గా టార్గెట్ చేస్తున్నారు. ఆయన కూడా నరేంద్ర మోడీ, అమిత్ షా, బీజేపీల పై పర్సనల్ వెళ్లిపోయారు. సేమ్ అప్పట్లో చంద్రబాబు కయ్యానికి ఎలా కాలు దువ్వారో ఇప్పుడు అదే విధంగా కేసిఆర్ కూడా వ్యవహరిస్తున్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడుకు పట్టిన గతే రాబోయే ఎన్నికల్లో కేసిఆర్ కు పట్టబోతున్నదా..? అనే అనుమానాలు. సందేహాలు కొంత మందిలో ఉన్నాయి. 2019 నాటికి ఏపిలో ఉన్న రాజకీయ పరిస్థితులు వేరు. ఇప్పుడు తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితులు వేరు. అప్పుడు ఏపిలో చంద్రబాబుకు బలమైన ప్రతిపక్షం ఉంది. బలమైన ప్రత్యామ్నాయం ఉంది. చంద్రబాబు కాకపోతే జగన్మోహనరెడ్డి అన్నట్లుగా ఉంది. ఇప్పుడు కేసిఆర్ కు అనుకూలమైన విషయం ఏమిటంటే..? బలమైన ప్రతిపక్షం లేదు. కాంగ్రెస్ బీజేపీ ఈ రెండు కూడా రాజకీయంగా టీఆర్ఎస్ కు సరిసమానం కాదు. ఇదే కేసిఆర్ ధీమా. బలమైన ప్రతిపక్షం ఉంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందన్న భయం. బీజేపి వ్యవస్థల వల్ల వాళ్ల కు సపోర్టు ఇస్తుంది. తమ ఆర్ధిక మూలాల మీద దెబ్బకొడుతుంది. తమ మీద నిఘా పెడుతుంది. వ్యతిరేక పక్షానికి సపోర్టు చేసి గెలిపిస్తుంది అన్న భయం ఉంటుంది. 2019 ఎన్నికల్లో చంద్రబాబుకు పట్టిన గతే పడుతుందన్న భయం ఉండేది. కానీ కేసిఆర్ కు ఆ భయం లేకపోవడానికి కారణం బలమైన ప్రతిపక్షం లేకపోవడమే. పైగా కేసిఆర్ కు ఒక స్ట్రాటజీ, ఒక వ్యూహం ఉంది.
తప్పనిసరి పరిస్థితులు వస్తే, మరీ వ్యతిరేక పరిస్థితులు వస్తే వెళ్లి కాంగ్రెస్ తో చేతులు కలపడానికి కూడా కేసిఆర్ సిద్ధమయిపోతున్నారు. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ అనే వారధి ద్వారా కాంగ్రెస్ పెద్దలతో ఒక సిగ్నల్ ఇచ్చి అయితే ఉంచారు. అనుకోని పరిస్థితుల్లో ఒక వేళ కలవాల్సి వస్తే కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్దమే. కానీ బీజేపీకి వ్యతిరేకంగా ఉండాలి అని డిసైడ్ అయ్యరని అంటున్నారు. ఎందుకంటే ..? దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం లేదు. తెలంగాణలో టీఆర్ఎస్ కు సమానమైన ప్రత్యర్ధి లేరో అదే విధంగా కేంద్రంలో బీజేపీకి ధీటుగా ప్రత్యామ్నాయ శక్తి లేదు. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ పుంజుకున్నప్పటికీ టీఆర్ఎస్ ఉన్నంత స్ట్రాంగ్ గా బలంగా లేవు. వనరుల పరంగా గానీ, కార్యకర్తల పరంగా కానీ టీఆర్ఎస్ ను ఎదిరించే శక్తి బీజేపీ, కాంగ్రెస్ లకు లేదు అని చెప్పవచ్చు. కేసిఆర్ మాటకారితనం, సెంటిమెంట్ రగల్చడం, వనరులను ఉపయోగించుకోవడం టీఆర్ఎస్ కు ఎసెట్ గా చెప్పుకోవచ్చు. టీఆర్ఎస్ సంస్థాగతంగా పాతుకుపోయి ఉంది. కాంగ్రెస్ పార్టీకి నాయకత్వ బలం ఉన్నప్పటికీ అంతర్గత విభేదాలు ఉన్నాయి. బీజేపీకి సంస్థాగత బలం లేదు కానీ నాయకత్వ బలం ఉంది. తెలంగాణలో ఈ మూడు పార్టీల తేడా ఇది.
టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ అవకాశాలు కూడా ఉన్నాయి. ఒక వేళ టీఆర్ఎస్ కు మ్యాజిక్ ఫిగర్ రాకుండా 40 – 45 సీట్లు వస్తే కాంగ్రెస్, ఎంఐఎం మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి అవకాశం ఇవ్వకూడదు. వాళ్లకు ఒక సారి అవకాశం ఇస్తే మరో సారి వేరే వాళ్లకు అవకాశం ఇవ్వరు అని కేసిఆర్ కు బాగా తెలుసు. అందుకని కేసిఆర్ వ్యూహం కేసిఆర్ కు ఉంది. అందుకే 2019 ఎన్నికల్లో ఏపిలో జరిగిన పరిస్థితులు తెలంగాణలో జరగకపోవచ్చు. ఆనాడు చంద్రబాబును ఏ విధంగా అయితే వ్యవస్థల ద్వారా ఇబ్బంది పెట్టారో అదే విధంగా అంత కంటే ఎక్కువగా కేసిఆర్ ను ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే గతంలో టీఆర్ ఎస్ కు అనుకూలమైన మైహోం రామేశ్వరరావు బీజేపీకి అనుకూలంగా మారిపోయారు. ఇలా ఎంతో మంది టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మారి బీజేపీకి అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఏమి జరుగుతుందో వేచి చూద్దాం.