ఇటు ఆంధ్రప్రదేశ్లో కాకుండా అటు దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారిన విషయం ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు. అధికార పార్టీ తీసుకున్న ఈ సంచలన నిర్ణయంపై వివిద పక్షాలు తమ వైఖరిని వెల్లడిస్తున్నాయి.
అయితే, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తరఫున ఆ పార్టీ ముఖ్య నేత, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
విజయవాడలో ఏపీ బీజేపీ చీఫ్గా సోమువీర్రాజు బాధ్యతలు స్వీకరించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా రాంమాధవ్ మాట్లాడుతూ ఒక రాజధాని నిర్మాణంలో అవినీతిని బిజెపి ప్రశ్నించింది.. మూడు రాజధానుల పేరుతో మళ్లీ అవినీతి చేస్తే బీజేపీ పోరాటం చేస్తుందని ప్రకటించారు. మూడు రాజధానులపై ప్రభుత్వం నిర్ణయానికి గవర్నర్ ఆమోదం తెలపడంతో కేంద్రం జోక్యం చేసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయన్నారు. అసలు మూడు రాజధానుల కాన్సెప్ట్ నే ఓ జోక్ అని రాంమాధవ్ కొట్టిపారేశారు. ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నందున తీర్పు వచ్చే వరకు వేచిచూద్దాం అన్నారు.
దేశంలో పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్కు ఒక్కటే రాజధాని ఉన్నప్పుడు.. ఏపీలో మూడు రాజధానులు ఎందుకని రాంమాధవ్ ప్రశ్నించారు. కేవలం అవినీతికి అవకాశం ఇవ్వడానికే అని వ్యాఖ్యానించారు. విభజన తరువాత అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని చెప్పామని వివరించారు. చంద్రబాబు అమరావతి రాజధానిగా ప్రకటిస్తే కేంద్రం అభ్యంతరం చెప్పలేదన్న ఆయన.. నిధులు కేటాయించి ప్రోత్సహించాం.. యూనివర్సిటీలు పెట్టామని గుర్తుచేశారు. ఇప్పుడు మూడు రాజధానులు అంటే… కేంద్రం జోక్యం చాలా పరిమితంగా ఉంటుందని రాంమాధవ్ పేర్కొన్నారు. అమరావతి రైతులు, ప్రజలకు పూర్తిగా న్యాయం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని రాంమాధవ్ స్పష్టం చేశారు. రాంమాధవ్ కామెంట్ల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ను ఉదాహరణగా తీసుకొని కేంద్రం జోక్యం చేసుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది.
ఈ సందర్భంగా బీజేపీ నేతలకు సైతం రాంమాధవ్ కీలక పిలుపు ఇచ్చారు. ప్రతి దానికి ఢిల్లీ ఏదో చేయాలని ఎదురు చూడకుండా.. రాష్ట్ర నేతలో గట్టిగా పోరాడాలి.. వీధుల్లోకి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో జరిగే దౌర్జన్యాలను తిప్పికొట్టాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.