2024లో జరగబోయే ఎన్నికల్లో ఏపీలో అధికారం చేపట్టబోతున్నాం. ఇది ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆ పార్టీ సీనియర్ నేత సోము వీర్రాజు సంచలన కామెంట్.
నిజంగా సాధ్యమేనా అనే విషయం రాజకీయ వర్గాల్లో సహజంగానే తెరపైకి వస్తోంది. అయితే, ఏపీలో బీజేపీ బలపడటం మాత్రం పక్కా అని దీనికి వీర్రాజు లెక్కలు ఆయనకు ఉన్నాయని అంటున్నారు.
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతులు స్వీకరించిన సోము వీర్రాజు జనసేనతో కలసి తామే మూడవ ప్రత్యామ్నాయంగా వస్తామనీ, 2024లో తమ కూటమి అభ్యర్థికే ముఖ్యమంత్రి పదవి దక్కుతుందని ప్రకటించేశారు. చంద్రబాబు తమ పార్టీని నాశనం చేయాలని ప్రయత్నించారనీ, తాము కూడా ఆయనను ఆ విధంగానే చూస్తామని తమ వైఖరిని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. ప్రస్తుత ప్రభుత్వ తప్పిదాను విమర్శిస్తూనే గతంలో జరిగిన అవినీతిని వెలికితీయడానికి కూడా కృషి చేస్తామన్నారు. ఇలా విస్పష్ట ప్రకటన చేయడం వెనుక వీర్రాజు గేమ్ ప్లాన్ వేరేనంటున్నారు.
జనసేన పార్టీ అధ్యక్షుడు, ఇటీవలే `మళ్లీ` మిత్రపక్షంగా మారిన సినీ నటుడు పవన్ కళ్యాణ్ రూపంలో వీర్రాజు కొత్త స్కెచ్ వేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అదే టార్గెట్ టీడీపీ. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ఇటు అభివృద్ధి అటు సంక్షేమం అజెండాతో ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ఓటు బ్యాంకును చీల్చడం ఇప్పట్లో అయ్యే పనికాదు. అందుకే ప్రతిపక్షమైన టీడీపీ క్యాడర్ను లాడం సులభమని అంటున్నారు. ఇప్పటికే, అమరావతిలో రాజధాని, మూడు రాజధానుల వికేంద్రీకరణ విషయంలో టీడీపీ నేతలే లోలోపల అసంతృప్తితో ఉన్నారు. అలాంటి వారికి వలవేయాలని భావిస్తున్నట్లు సమాచారం.