“ఓ బంగారు వ్యాపారి. తన వాహనంలో తమిళనాడు నుండి ఆంధ్ర వస్తున్నారు. తనిఖీల్లో భాగంగా పోలీసులు ఆపారు. వాహనం తనిఖీ చేసారు. రూ. అయిదున్నర కోట్లు, కొంత బంగారం దొరికింది. లెక్కలు, పత్రాలు లేవు. దీంతో ఆదాయపు పన్ను శాఖ విచారణకు సిద్ధమైంది. ముగ్గురు అధికారుల బృందంతో కమిటీ వేసింది. చెన్నై ఐటీ సర్కిల్ కమీషనర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో విచారణ ఆరంభమయింది. సింపుల్ గా చెప్పుకోవాలంటే జరిగింది ఇదే. కానీ దీని చీకటి కోణాలు, లెక్కలోకి రాని “నోటి” మాటలే చాలా ఉన్నాయి.
దొరికిన డబ్బు ఓ చోటా నాయకుడిది. ఆయన వెనుక ఉన్నదీ ఓ పెద్ద నాయకుడు. ప్రకాశం జిల్లా ఒంగోలు వీళ్లది. ఈ అయిదున్నర కోట్ల లావాదేవీలపై ఆదాయపన్ను శాఖ గుట్టు లాగితే మరిన్ని చీకటి అంశాలు బయటకు వస్తాయి. విచారణ చేపట్టిన అనిల్ కుమార్ కి ఐటీ సర్కిళ్లలో మంచి పేరు ఉండడంతో ఏపీలో ఆ నాయకుడి లీలలు బయటకు రావడం ఖాయంగా ఉంది.
“నల్ల”డబ్బుతో ఎన్నాళ్లగానో…!
బంగారం కొనుగోళ్లు అన్ని కేంద్ర అధీనంలో ఉండే సెర్వర్ లో నమోదు కావాలి. రోజువారీ అమ్మకాలు, కొనుగోళ్లు అన్నీ నమోదు కావాల్సిందే. అలాగే ఆర్ధిక లావాదేవీలు కూడా చెక్కులు, బ్యాంకు ట్రాన్స్ఫర్ల ద్వారా జరగాలి. ప్రతీ గ్రాముకి లెక్క, సరైన పత్రాలు నిర్వహించాలి. కానీ చాలా చోట్ల చీకటి వ్యాపారం తో ఇన్నాళ్లు నెట్టుకొస్తున్నారు. ఈరోజు తమిళనాడు – ఆంద్ర సరిహద్దులో పట్టుబడ్డారు. ఆరంబాకంలో కేసు నమోదయ్యింది. ఈ వ్యాపారిది ప్రకాశం జిల్లా ఒంగోలు. పెద్ద జ్యుయలర్ షోరూములు ఉన్నాయి. ఈ వ్యాపారి పేరు నల్లమల బాలు. ఈ మధ్యనే ఏకగ్రీవంగా కార్పొరేటర్ అయిపోయారు. పెద్ద నాయకుడి అండ పుష్కలంగా ఉంది. ఎన్ని ఉంటె ఏం లాభం..?? దొరికింది తమిళనాడులో…, పట్టుకుంది కేంద్ర అధీనంలో ఉండే ఆదాయపుపన్ను శాఖ అధికారులు…! చెప్పడానికి లెక్క లేదు, రికమెండ్ చేయడానికి సొంత రాష్ట్రం కాదు, అందుకే ప్రస్తుతానికి అక్కడ బుక్కయ్యారు. ఆదాయపు పన్ను శాఖ ఈ విషయాన్నీ సీరియస్ గా తీసుకుంది. వెంటనే ముగ్గురు అధికారులతో కమిటీని వేసింది. మొత్తం వ్యవహారాన్ని తేల్చాలని ఆదేశించింది. అక్కడితో ఆగుతుందా? ఒంగోలు కూడా వచ్చి ఈ “నల్ల”డబ్బు లెక్క తేలుస్తుందా..? అనేది చూడాల్సి ఉంది.
ఈ వ్యాపారి ఎవరు…? వ్యాపారాల్లో ఎలా రాణించారు..? ఈయన వెనుక ఎవరున్నారు…? ఒంగోలులో జరిపే లావాదేవీలు ఏంటి అనేది మరిన్ని వివరాలతో రేపటి కథనం..!