Pegasus: దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్న పెగాసస్ స్పైవేర్ అంశంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పెగాసస్ అంశంపై పార్లమెంట్ ఉభయ సభల్లో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. దీనిపై విపక్షాలు తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. పెగాసస్ స్పైవేర్ అంశంపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని కోరుతూ ఎన్ రామ్ మరి కొందరు దాఖలు చేసిన పిటిషన్ లపై గురువార సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఇజ్రాయిల్ లోని ఎన్ ఎస్ ఓ గ్రూపు తయారు చేసిన ఈ స్పైవేర్ తో కొందరు రాజకీయ నేతలు, ఉద్యమకారులు, పాత్రికేయులపై కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టినట్లు పిటిషనర్లు ఆరోపించారు. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు.
వార్తా పత్రికలలో వచ్చిన కథనాలు నిజమైనవే అయితే ఈ వ్యవహారం చాలా తీవ్రమైందని సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్లు తమ పిటిషన్ కాపీలను ప్రభుత్వానికి అందించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం సూచించింది. దీనిపై తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేస్తూ ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు కూడా విచారణ కు హజరు కావాలన ఆదేశించింది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు పెగాసస్ హ్యాకింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పెగాసస్ లక్ష్యంగా చేసుకున్న వారిలో 300 మందికిపైగా భారతీయులు ఉన్నారు. వారిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, టిఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, పలువురు కేంద్ర మంత్రులు, పాత్రికేయులు ఉన్నట్లు తెలిసింది. తాజాగా సుప్రీం కోర్టు రిజిస్ట్రార్లుగా పని చేసిన ఇద్దరు ఫోన్లూ హ్యాకింగ్ జాబితాలో కనిపించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో పెగాసస్ పై పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్షాలు ఆందోళన చేపడుతుండటంతో సభలు వాయిదా పడుతూ వస్తున్నయి.