PM Modi : దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా మళ్లీ విస్తృంభన కొనసాగుతోంది. నాలుగైదు రోజుల నుండి 20 వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా కట్టడికి మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో లాక్డౌన్, రాత్రి సమయాల్లో కర్ఫూ లాంటి కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 24వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్రం అప్రమత్తం అయ్యింది. కరోనా పూర్తి స్థాయి కట్టడికి మరో సారి దృష్టి సారించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో బుధవారం వర్చువల్ సమావేశం నిర్వహిస్తున్నారు. కరోనా కట్టడికి ఇప్పటికే పలు రాష్ట్రాలు తగిన చర్యలు తీసుకుంటున్నా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతున్నప్పటికీ కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటి వరకు కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలను వివరించనున్నారు. తాజాగా కరోనా స్ట్రెయిన్ కేసులు కూడా వెలుగుచూస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ఈ వర్చువల్ సమావేశంలో పీఎం మోడీ తగు సూచనలు జారీ చేసే అవకాశం ఉంది. సమావేశం అనంతరం కరోనా అదుపునకు కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశం ఉంది.
గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 24,492 కరోనా కేసులు నమోదు అయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజాగా నమోదు అయిన కేసులతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య కోటి 14 లక్షలకు చేరుకుంది. ఈ మహమ్మారి కారణంగా 24 గంటల్లో 131 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 2,23,432 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. కేసుల నమోదు కంటే రికవరీ శాతం తక్కువగా ఉండటం కొంత ఆందోళనకరపరిస్థితి.