Supreme Court: మోసపూరిత ప్రకటనలు ఆపాలని, లేకుంటే భారీగా జరిమానా తప్పదని రాందేవ్ బాబాకు చెందిన పతంజలి ఆయుర్వేద సంస్థకు సుప్రీం కోర్టు హెచ్చరించింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రలతో కూడిన ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. ఆధునిక అల్లోపతి వైద్యాన్ని, ఆ విధానాన్ని అనుసరించే వైద్యులను కించపరిచేలా..నిరాధార ఆరోపణలు చేస్తున్న పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల వ్యాపార ప్రకటనలను తక్షణం నిలిపివేయాలని ఆదేశించింది సుప్రీం కోర్టు.
ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ సహ వ్యవస్థాపకుడిగా ఉన్న పతంజలి ఆయుర్వేద కంపెనీ తమ ఉత్పత్తులు పలు వ్యాధులను నయం చేస్తాయని ప్రకటించుకోవడంపై కూడా సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పతంజలి సంస్థ చేస్తున్న నిరాధారమైన, మోసపూరిత ప్రకటనలను నిలుపుదల చేయాలని లేకుంటే ఆ కంపెనీ తయారు చేసే ఒక్కో ఉత్పత్తిపై కోటి రూపాయల చొప్పున జరిమానా విధించే విషయాన్ని పరిశీలించాల్సి వస్తుందని ధర్మాసనం హెచ్చరించింది. భవిష్యత్తులో ఇటువంటి మోసపూరిత ప్రకటనలు ఇవ్వకూడదని పేర్కొంది.
పతంజలి ఆయుర్వేద కంపెనీ అసత్య ప్రచారాన్ని అడ్డుకునే మార్గాన్ని కనుగొనాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు సూచించింది. ఆధునిక వైద్యం, వైద్యులను కించపరిచేలా వ్యవహరించటం సరికాదని తెలిపింది. ఇటువంటి ప్రకటనలు ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని ధర్మాసనం అభిప్రాయపడింది. యావత్ ప్రపంచాన్ని కల్లోలానికి గురి చేసిన కోవిడ్ మహమ్మారి వైరస్ నివారణకు వినియోగిస్తున్న ఆధునిక ఔషదాలు, టీకాలకు వ్యతిరేకంగా రాందేవ్ బాబా ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ ఐఎంఏ సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ పై ధర్మాసనం విచారణ చేపట్టింది. తదుపరి విచారణను 2024 ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేసింది.
ఐఎంఏ తరుపున సీనియర్ న్యాయవాది పీఎస్ పట్వాలియా, మరో అడ్వకేట్ ప్రభాస్ బజాజ్, పతంజలి సంస్థ తరపున సీనియర్ న్యాయవాది సాజన్ పూవయ్య వాదనలు వినిపించారు. కేంద్ర ప్రభుత్వం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్ వాదనలు వినిపించగా, ఈ కేసులో ఇంప్లీడ్ అయిన నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఫార్మకాలజీ అండ్ థెరప్యూటిక్స్ తరుపున మృణ్మోయ్ చటర్జీ వాదించారు.
E Challan Scam: ఈ – చలానా స్కామ్ కేసులో మాజీ డీజీపీ అల్లుడు అవినాష్ కొమ్మిరెడ్డి అరెస్టు