WHO: కరోనా వైరస్ సెకండ్ వేవ్ ధాటికి అన్ని దేశాలు వణికిపోయాయి. భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా ప్రభావంతో ఏప్రిల్ నుండి కర్ఫ్యూ, లాక్ డౌన్ ఆంక్షల్లోకి వెళ్లిపోయాయి. తాజాగా దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రెండు నెలల అనంతరం కనిష్టంగా నమోదు అయ్యాయి. దీంతో పలు రాష్ట్రాల్లో వైరస్ నియంత్రణలోకి రావడంతో ఆంక్షలను సడలిస్తున్నట్లు ఆయా రాష్ట్రాలు ప్రకటించాయి. ఢిల్లీ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు ఆంక్షలు సడలించాయి. దీంతో దుకాణాలు, కార్యాలయాలు తెరుచుకున్నాయి.
Read More: Narendra Modi: ఆ నిర్ణయం.. ఆ”మోదీ”యం..! ఎన్నో దెబ్బల తర్వాత ఒక మందు..!!
వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తి స్థాయిలో జరగకుండా కేసులు తగ్గుతున్నాయని ఆంక్షలు ఎత్తివేయడం సరికాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) పేర్కొంటోంది. ప్రస్తుత కరోనా పరిస్థితులపై డబ్ల్యుహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ గేబ్రియేసస్ ఓ మీడియా సమావేశంలో ఈ విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతర్జాతీయ ప్రయాణాల్లో ఇప్పటికిప్పుడు ఆంక్షలు సడలించడం ప్రమాదకరమని అయన పేర్కొన్నారు. వ్యాక్సిన్ తీసుకోని వారి పట్ల ఇది తీవ్ర ముప్పుగా పరిణమిస్తుందని అన్నారు. పలు దేశాలల్లో డెల్టా వేరియంట్ వ్యాప్తి పెరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ అసమానతల పట్ల ఆయన విచారం వెలిబుచ్చారు. ఒక వైపు పాశ్చాత్య దేశాలు టీకా ద్వారా రక్షణ పొందుతుంటే మరో వైపు పేద దేశాలు ఇప్పటికీ కరోనాతో పోరాడుతూనే ఉన్నాయన్నారు. దీన్ని బట్టి చూస్తే ప్రపంచం రెండు భాగాలుగా మారిపోయినట్లు కనిపిస్తోందని గేబ్రియేసస్ అభిప్రాయపడ్డారు.