భడోహి(ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్లోని భడోహి జిల్లాలో ఒక కార్పెట్ ఫ్యాక్టరీలో శనివారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటన కారణంగా పది మంది మృతి చెందగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
పేలుడు ధాటికి దుకాణం కుప్పకూలిపోయింది. అక్రమంగా బాణాసంచా తయారు చేస్తుండటం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.
ఈ భారీ పేలుడు ధాటికి సమీపంలోని మూడు దుకాణాలు కూడా ధ్వంసం అయ్యాయి. శిధిలాల క్రింద మరి కొందరు ఉంటారని అనుమానిస్తున్నారు.
మృతి చెందిన వారిలో దుకాణ యజమానితో పాటు మరో ముగ్గురిని గుర్తించామనీ, మిగిలిన వారిని గుర్తించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.
పోలీస్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఎన్డిఆర్ఎఫ్ బృందం అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది.