వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి.. టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని ముందుకు సాగుతున్న విష యం తెలిసిందే. ఈ క్రమంలో ప్రకటించిన సీట్ల వ్యవహారం.. ఆసక్తిగా మారింది. మొత్తం 175 స్థానాల్లో జనసేనకు 24 సీట్లు, టీడీపీ కి 94 స్థానాలను కేటాయించినట్టు స్వయంగా చంద్రబాబు చెప్పారు. ఇక, బీజేపీ కోసమని 57 స్తానాలను అట్టేపెట్టామన్నారు. ఇక, ఈ సమయంలోనే 94 స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించారు.
అయితే.. 24 అసెంబ్లీ స్థానాలు ప్రకటించుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం.. కేవలం 5 స్థానాల్లోనే అభ్యర్థులను ప్రకటించుకున్నారు. తెనాలి-నాదెండ్ల మనోహర్, నెల్లిమర్ల-లోకం మాధవి, రాజా నగరం-బత్తుల బలరామకృష్ణ, అనకాపల్లి-కొణతాల రామకృష్ణ, కాకినాడ రూరల్ – పంతం నానాజీలను మాత్రమే ప్రకటించారు. మిగిలిన వారి పేర్లను ప్రకటించలేదు. వాస్తవానికి ఇప్పటికే 20 స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారని అంతర్గత సమాచారం.
అయితే.. ఇప్పుడు 5 స్థానాలకే అభ్యర్థులను ప్రకటించడం.. కేవలం 24 స్థానాలనే జనసేన కోరుకోవడంపై ఆసక్తికర చర్చ అయితే సాగుతోంది. దీనికి కొందరు లాజిక్ను విశ్లేషిస్తున్నారు. 5 మంది అభ్యర్థులనే ప్రకటించడం వెనుక.. ఐదు సంఖ్య పవన్కు కలిసి వచ్చిన అదృష్టసంఖ్య అని .. ఆయన ఏం చేసినా.. ఐదుతో ప్రారంభిస్తారని.. అది ఆయనకు విజయాలు అందిస్తుందని అందుకే.. ఇలా ఐదును ఎంపిక చేసుకున్నారనే కథనాన్ని కొందరు చెబుతున్నారు. ఇది లాజిక్కు అందకపోయినా సర్దుకు పోతున్నారు.
ఇక, 24 స్థానాలనే ఎంపిక చేసుకోవడం వెనుక.. ఫిబ్రవరి 24న ప్రకటించడం.. 2024 సంవత్సరం కావడంతో.. 2024-24 మొత్తంగా రెండు 24లు కలిసి రావడంతో 24 సీట్లనే ఎంపిక చేసుకున్నారనే చర్చ మరోవైపు సాగుతోంది అయితే.దీనిపై అనేక సటైర్లు వస్తున్నాయి. మార్చి 1న ప్రకటించి ఉంటే.. 1 సీటును మాత్రమే కోరేవారా? అని కొందరు సటైర్లువేస్తున్నారు. ఇక, సంచలన దర్శకుడు ఆర్జీవీ చేసిన కామెంట్లు అందరికీ తెలిసినవే.