బీజేపీ చాణక్యుడు అమిత్ షా అంటే ఏంటో మరోమారు రుజువైంది. బెంగాల్ లో రాజకీయం రూపు మారుతోంది. వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్న పశ్చిమ బెంగాల్ రాజకీయాలు వేడెక్కాయి.
ఎలాగైనా బెంగాల్ కోటలో పాగా వేయాలని చూస్తున్న కమలంకు 2019 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలు మంచి బూస్ట్ ఇచ్చాయి. కష్టపడితే అధికారంలోకి రావచ్చని భావించిన కమలం పార్టీ ఏడాది ముందు నుంచే ఆ రాష్ట్రంపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా మమత బెనర్జీకి అమిత్షా ఊహించని షాక్ ఇచ్చారు.
11 మంది ఎమ్మెల్యేలతో…
ఇటీవల టీఎంసీకి రాజీనామా చేసిన కీలక నేత సువేందు అధికారితో దీదీకి షాకిచ్చారు. సువేందు జంప్ అవడమే కాకుండా తనతోపాటు మరో 10 మంది టీఎంసీ ఎమ్మెల్యేలను వెంట తీసుకెళ్లాడు. ఇవాళ బీజేపీలో చేరిన బెంగాళ్ ఎమ్మెల్యేల్లో సువేందు అధికారి, తాపసి మొండల్, అశోక్ దిండా, సుదీప్ ముఖర్జీ, సైకత్ పంజా, షి భద్ర దత్త, దీపాలి బిశ్వాస్, సుక్రా ముండా, శ్యామస్థ ముఖర్జి, బనశ్రీ మైతీ ఉన్నారు. వారితో పాటు పర్బ బుర్ద్యాన్ నియోజక వర్గ ఎంపీ సునీల్ మొండల్, మాజీ ఎంపీ దశరథ్ టిర్కీ కూడా అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. సువేందు వెంట మహా అయితే.. మరో ముగ్గురు, నలుగురు ఎమ్మెల్యేలు వెళతారని టీఎంసీ ముందుగానే ఊహించింది. అయితే.. వారి అంచనాలకు మించి ఇప్పుడు ఏకంగా 11 మంది టీఎంసీని వీడి… బీజేపీ పార్టీలోకి వెళ్లడం అమిత్ షా వ్యూహమేనని పలువురు అంచనా వేస్తున్నారు.
బెంగాల్ లో అమిత్ షా బిజీ బిజీ
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రెండు రోజుల పర్యటన కోసం వెస్ట్ బెంగాల్ వెళ్లారు. ఆదివారం తెల్లవారు జామున కోల్కతా వెళ్లిన అమిత్ షా, ఉదయం శ్రీరామకృష్ణ ఆశ్రమాన్ని సందర్శించారు. అక్కడి నుంచి వివేకానందుడు జన్మించిన ఇంటికి వెళ్లి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేశారు. అనంతరం అక్కడి నుంచి స్వాతంత్ర సమరయోధుడు కుదీరామ్ బోస్ జన్మించిన మిడ్నాపూర్ లోని అయన సొంత గ్రామానికి వెళ్లారు. అక్కడి నుంచి పెద్ద ఎత్తున ర్యాలీని నిర్వహించారు.