Amit Shah : పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అక్కడ రాజకీయం మరింత రసవత్తరంగా మారుతున్నాయి.
రెండుసార్లు రాష్ట్ర పగ్గాలు చేట్టిన టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మూడవ సారి కూడా అధికారాన్ని కైవసం చేసుకుని హ్యాట్రిక్ సాధించాలని భావిస్తుండగా… ఈ సారి ఎలాగైనా పశ్చిమబెంగాల్లో కాషాయ జెండాను రెపరెపలాడించాలని భావిస్తోంది బీజేపీ అధిష్టానం. ఈ నేపథ్యంలోనే బీజేపీ ముఖ్య నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. పార్టీ శ్రేణులకు కీలక దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో పార్టీల గెలుపోటములపై సోషల్ మీడియా తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో దానిపై ప్రముఖంగా ఫోకస్ చేయాలని సూచించారు. అంతేకాదు.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి బీజేపీ సోషల్ మీడియా టీమ్కు అమిత్ షా భారీ టార్గెట్ విధించారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 కోట్ల జనాభా ఉండగా, బీజేపీ సోషల్ మీడియా టీమ్.. కనీసంగా 2 కోట్ల మంది ప్రజలను రీచ్ అవ్వాలని లక్ష్యం నిర్దేశించారు. ఎన్నికల సమీపించేలోపు ఈ టార్గెట్ను కంప్లీజ్ చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. అమిత్ షా టార్గెట్కి సంబంధించి జాతీయ మీడియాలో వార్తలు ప్రసారమవుతున్నాయి.
Amit Shah : కసి మీదున్న కమలనాథులు!
పశ్చిమబెంగాల్లో మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, 42 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. దేశంలో అతిపెద్ద రాష్ట్రాల జాబితాలో ముందు వరుసలో ఉన్న పశ్చిమబెంగాల్లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో గనుక విజయం సాధించినట్లయితే.. రానున్న పార్లమెంట్ ఎన్నికల నాటికి రాష్ట్రంపై పూర్తిస్థాయిలో పట్టు సాధించవచ్చునని బీజేపీ ఆలోచిస్తోంది. తద్వారా 42 లోక్సభ స్థానాల్లో అత్యధిక సీట్లను కైవసం చేసుకున్నట్లయితే వచ్చే టర్మ్ కూడా కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టేందుకు మార్గం సుగమం అవుతుందని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. ఆ కారణంగానే వెస్ట్ బెంగాల్లో ఎలాగైనా గెలవాలని బీజేపీ నేతలు ఇప్పటి నుంచే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇప్పటికే అధికార టీఎంసీకి చెందిన కీలక నేతలు పలువురిని బీజేపీలోకి లాగేసుకున్నారు. ఎన్నికల నాటికి మరికొంతమంది నేతలు బీజేపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.