గత ఏడాది కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. అన్ని రంగాలపై ఆ ప్రభావం పడింది. లక్షలాది మంది ఉపాధి లేక అల్లాడిపోయారు. కానీ కరోనా ఏడాది వీడ్కోలు పలికేందుకు మందు బాబులు ఖర్చుకు వెనుకాడలేదు. ఏపిలో డిసెంబర్ 30,31 తేదీల్లో రూ.200 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు తెలిసింది. డిసెంబర్ నెలలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి. సుమారు రూ.2,180 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు ఏపి ఎక్సైజ్ శాఖ తెలిపింది గతంలో ఎన్నడూ 2వేల కోట్ల అమ్మకాలు దాటలేదు. గతంతో పోలిస్తే 47శాతం అమ్మకాలు తగ్గినప్పటికీ పెంచిన అధిక ధరల కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చింది. రెండు రోజుల్లో 200 కోట్ల రూపాయల అమ్మకాలు జరగడం విశేషం.
ఇక తెలంగాణలోనూ మద్యం అమ్మకాలు రికార్డు సృష్టించాయి. గత నాలుగు నెలల్లోనే దాదాపు రూ.759 కోట్ల విలువైన మద్యం అమ్ముడైనట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఏపి సరిహద్దుగా ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 75.98 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు సమాచారం. డిసెంబర్ నెలలో మద్యం విక్రయాలు రూ.2వేల కోట్లకుపైగా జరిగినట్లు తెలంగాణ ఎక్సైజ్ అధికారులు పేర్కొంటున్నారు.
కరోనా నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించినప్పటికీ మందు బాబులు ఏ మాత్రం తగ్గలేదు. బహిరంగ ప్రదేశాలలో వేడుకలను నిషేదించిన సంగతి తెలిసిందే. ఏది ఏమైనా కరోనా పెట్టిన కష్టాలను మరచిపోయేందుకు, నూతన సంవత్సరం హాపీగా ఉండాలని కోరుకుంటూ మందు బాబులు ఎంజాయ్ చేశారు.