అమరావతి : తెలంగాణలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం లోక్ డౌన్ అమలుకు చర్యలు తీసుకోనుందని వార్తలు వస్తున్నాయి. దీని తో హైదరాబాద్ లో స్థిరపడిన ఆంధ్రా ప్రాంతీయులు పెద్ద సంఖ్యలో సొంత కార్లు, ప్రైవేట్ వాహనాల్లో స్వగ్రామాలకు బయలు దేరి వస్తున్నారు. ఈ నేపథ్యంలో అనుమతి పత్రాలు లేని వారిని ఆంధ్రప్రదేశ్ పోలీస్ లు హైదరాబాద్ -విజయవాడ జాతీయ రహదారిపై గరికపాడు బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద నిలుపుదల చేసి వెనక్కు పంపుతున్నారు. అనుమతి పత్రాలు ఉండి, థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకున్న వారిని మాత్రమే ఆంధ్రాలోకి అనుమతి ఇస్తున్నారు.
ఈ సందర్బంగా తెలంగాణ నుండి వచ్చే వారికి ఆంధ్రప్రదేశ్ డీజేపీ గౌతమ్ సవాంగ్ పలు సూచనలు చేశారు. కరోనా నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దుల్లో చెక్పోస్టులు, ఆంక్షలు కొనసాగుతున్నాయని అయన వెల్లడించారు. సరిహద్దుల్లో థర్మల్ స్క్రీనింగ్ చేశాకే అనుమతి ఇవ్వడం జరుగుతోందని చెప్పారు.
పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారిని అనుమతించే విషయంలో ఆంక్షలు కొనసాగుతున్నాయని గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వచ్చే వారు కచ్చితంగా అనుమతి తీసుకోవాల్సిందేనని పేర్కొన్నారు. స్పందన ద్వారా దరఖాస్తు చేసుకొని పాస్ (అనుమతి) పొందాలని అయన సూచించారు. పాస్ ఉన్న వారిని ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే అనుమతిస్తామని సవాంగ్ తెలిపారు. రాష్ట్ర సరిహద్దులోని పోలీస్ చెక్పోస్టుల వద్ద థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతే అనుమతిస్తారని చెప్పారు. పాస్లు ఉన్నప్పటికీ రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు అనుమతించేది లేదని వెల్లడించారు.
రాత్రి వేళల్లో అత్యవసర, నిత్యావసర సర్వీసులకు మాత్రమే అనుమతి ఉంటుందని అయన చెప్పారు. పరిస్థితిని అర్థం చేసుకుని ప్రజలు సహకరించాలని డీజీపీ సవాంగ్ విజ్ఞప్తి చేశారు.