AP High Court: ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల ఏపీ టెట్ నోటిఫికేషన్, డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల అయిన సంగతి తెలిసిందే. అయితే..ఇప్పటికే టెట్ పరీక్షలు సైతం జరుగుతున్నాయి. అయితే ఏపీ టెట్, డీఎస్సీ నోటిఫికేషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీ టెట్, డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ మార్చాలని సూచించింది. ఈ పరీక్షల మధ్య కనీసం నాలుగు వారాల గడువు ఉండాలని స్పష్టం చేసింది.
మార్చి 15 నుండి ఇచ్చిన డీఎస్సీ షెడ్యుల్ ను ధర్మాసనం సస్పెండ్ చేసింది. టెట్ పరీక్షల ఫలితాలు మార్చి 14న వస్తున్నాయనీ, మార్చి 15 నుండి డీఎస్సీ పరీక్షలు పెట్టడంపై పలువురు విద్యార్ధులు హైకోర్టులో పిటిషన్ లు దాఖలు చేశారు. ఈ పిటిషన్ లపై సోమవారం (ఇరోజు) హైకోర్టులో విచారణకు రాగా.. పిటిషనర్ల తరపున న్యాయవాది జువ్వాడి శరత్ చంద్ర వాదనలు వినిపించారు.
కేవలం ఒక్క రోజు సమయంలో విద్యార్ధులు ఎలా ప్రిపేర్ అవుతారని శరత్ చంద్ర ప్రశ్నించారు. ఇప్పటి వరకూ ఎప్పుడూ అటువంటి షెడ్యుల్ ఇవ్వలేదని వాదించారు. నిరుద్యోగుల హక్కులను హరిస్తున్నారని న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. పిటిషనర్ల తరపున న్యాయవాదుల వాదనలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం ..మార్చి 15 నుండి ఇచ్చిన డీఎస్సీ షెడ్యుల్ ను సస్పెండ్ చేసింది. టెట్ ఫలితాలు, డీఎస్సీ పరీక్షలకు నాలుగు వారాలు కనీసం సమయం ఉండాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
మొత్తం 6,100 టీచర్ల పోస్టుల భర్తీ చేయడానికి ఏపీ ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ డీఎస్సీ షెడ్యుల్ ప్రకారం మార్చి 15వ తేదీ నుండి 30 వ తేదీ వరకూ ఆన్ లైన్ విధానంలో పరీక్షలను నిర్వహిస్తారు. ఈ పరీక్షలను రోజు రెండు విడతలుగా ఉంటాయి. ఉదయం 9.30 గంటల నుండి 12 గంటల వరకూ మొదటి విడత, మధ్యాహ్నం 2.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు రెండో విడత ఉంటుంది.