AP E challan scam: విధి నిర్వహణలో ఉన్న ఉన్నతాధికారులు బంధు ప్రీతి, ఆశ్రిత పక్షపాతం చూపితే వారికి ఉన్న మంచి పేరు దెబ్బతింటుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సీనియర్ పోలీస్ అధికారి (ఐపీఎస్) నండూరి సాంబశివరావు డీజీపీగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన తన విది నిర్వహణలో ప్రతిష్టాత్మక ఇండియన్ పోలీస్ మెడల్, ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ పురస్కారాలు అందుకున్నారు. అటువంటి అధికారి బంధుప్రీతి, ఆశ్రితపక్షపాతం కారణంగా పదవీ విరమణ తర్వాత విమర్శలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నండూరి సాంబశివరావు డీజీపీగా ఉన్న సమయంలో (2017 జూన్ 27న) ఆయన అల్లుడు కొమ్మిరెడ్డి అవినాష్ కి చెందిన డేటా ఎవాల్వ్ సొల్యూషన్ ఈ – చలానాల సర్వీస్ ప్రొవైడర్ బాధ్యతలు అప్పగించారు. ఆన్ లైన్ బిడ్డింగ్ లో కేవలం ఒక్క రూపాయికి కోట్ చేసి, టెండరు దక్కించుకున్న ఆ సంస్థ నిర్వహకులు.. డీజీపీ ఖాతాకు జమ కావాల్సిన నగదులో రూ.36.53 కోట్లను సంస్థ సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా కొంత మొత్తం నొక్కేసి మిగిలిన మొత్తాన్ని రజోర్ పే గేట్ వే ద్వారా డీజీపీ ఖాతాకు జమ చేస్తూ వచ్చారు. అయిదేళ్లలో ఈ సంస్థ వసూలు చేసిన వంద కోట్లలో రూ.36.53 కోట్లు కాజేసింది.
కుంభకోణం బయటపడింది ఇలా..
తిరుపతి డీఎస్పీ నర్సప్ప తన యూనిట్ నుండి ఏ రోజు ఎంత వసూలు చేసింది ఆరా తీస్తున్న క్రమంలో మొదటి రోజు చూసిన మొత్తానికి, ఆ తర్వాత నాలుగు రోజులకు చూసిన మొత్తానికి తేడా కనిపించింది. ఆయనకు అనుమానం రావడంతో ఈ ఏడాది మే 1 నుండి 20 వరకూ జరిగిన లావాదేవీలపై ఆరా తీశారు. అందులో తేడాలు కనబడటంతో విషయాన్ని ఆయన ఆగస్టు 31న పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో వెంటనే పోలీస్ శాఖ అంతర్గతంగా విచారణ జరిపించడంతో ట్రాపిక్ ఈ – చలానాలలో జరిగి భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.
ట్రాఫిక్ ఈ – చలానాల రూపంలో ఏపీ పోలీసులు వసూలు చేసిన సొమ్ము ఏకంగా రూ.36.55 కోట్ల తమ సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నారని విచారణలో తేలడంతో అవినాష్ తో పాటు ఆయన కంపెనీ డాటా ఎవాల్వ్ కు చెందిన ఆస్తుల క్రయ విక్రయాలను నిలిపివేయాలని రిజిస్ట్రేషన్ శాఖకు లేఖ రాసినట్లు గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు తెలిపారు.
అవినాష్ కుటుంబ సభ్యుల కోసం గాలింపు
ఈ కుంభకోణంలో డాటా ఎవాల్వ్ సంస్థకు చెందిన కొత్తపల్లి రాజశేఖర్ ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. కీలక నిందితుడైన అవినాష్ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు ఐజీ పాల్ రాజు. ఆ సంస్థలో డైరెక్టర్ లుగా ఉన్న అవినాష్ సోదరి అక్షిత, రవికిరణ్ కూడా ఈ కేసులో భాగస్వాములుగా ఉన్నారని, వారిని త్వరలో అరెస్టు చేస్తామని చెప్పారు. క్లోనింగ్ యాప్ ద్వారా మళ్లించిన సొమ్ము ఎవరెవరి ఖాతాల్లోకి వెళ్లాయనే దానిపై విచారణ జరుగుతున్నదని పోలీసులు తెలిపారు. కాగా, ఈ భారీ కుంభకోణంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాత్ర లేకపోయినా తన హయాంలో అల్లుడు అవినాష్ చేసిన పని వల్ల మాజీ డీజీపీ సాంబశివరావు పేరు తెరపైకి రావడం, విమర్శలు ఎదుర్కోవాల్సి రావడం జరుగుతోంది.
Vangaveeti Radha: విజయవాడలో అట్టహాసంగా వంగవీటి రాధా వివాహం .. హజరైన పవన్ కళ్యాణ్