(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో సారి హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. తొలుత తనను పదవి నుండి తొలగించడంపై హైకోర్టును ఆశ్రయించిన నిమ్మగడ్డ, కోర్టు ఉత్తర్వులు అమలు చేయడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వంపై దిక్కార పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఉత్తర్వులతో ఇటీవల రెండవ సారి ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ తాజాగా సిఐడి కేసు విషయంపై హైకోర్టును ఆశ్రయించారు.
ఇంతకు ముందు నిమ్మగడ్డ రమేష్ కుమార్తనకు భద్రత కల్పించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాసిన విషయంపై రాష్ట్రంలో పెద్ద దుమారం రేగింది. ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం…ఆ లేఖ వ్యవహారం తేల్చేందుకు సిఐడి విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలో సిఐడి అధికారులు ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించి కంప్యూటర్ హార్డ్ డిస్క్ ఇతర వివరాలను తీసుకువెళ్లారు.
ఈ వ్యవహారంపై నిమ్మగడ్డ తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల సంఘం విధుల్లో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటూ ఉద్యోగులపై నమోదు చేసిన సిఐడి కేసు కొట్టివేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ కార్యాలయం నుండి సిఐడి అధికారులు తీసుకువెళ్లిన వస్తువులను తిరిగి అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, సిఐడి, డిజిపి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి తదితరులను తన పిటిషన్లో ప్రతివాదులుగా చేర్చారు రమేష్ కుమార్.
తమ సిబ్బందిపై నమోదు చేసిన సిఐడి కేసును రాజ్యాంగ విరుద్దంగా ప్రకటించడంతో పాటు ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐతో విచారణకు ఆదేశించాలని హైకోర్టును కోరారు నిమ్మగడ్డ. మరో పక్క ఎన్నికల సిబ్బందిపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఎన్నికల సంఘం సహాయ కార్యదర్శి సాంబమూర్తి హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. తనపై సిఐడి నమోదు చేసిన కేసును కొట్టివేయాలని ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ రెండు పిటిషన్లను స్వీకరించిన హైకోర్టు విచారణను సోమవారంకు వాయిదా వేసింది.