వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచీ టీడీపీ నుంచి చంద్రబాబు, లోకేశ్, యనమల, దేవినేని ఉమ.. అడపాదడపా పట్టాభిరామ్, చినరాజప్ప వంటి నాయకులు విమర్శలు చేస్తున్నారు. అయితే.. పది రోజులుగా పార్టీలోని ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వంపై విమర్శలు సంధిస్తున్నారు. నిజానికి.. పార్టీ ఎమ్మెల్యేల్లో అభద్రతాభావం ఉందని.. పార్టీ మారేందుకు కొందరు సిద్ధంగా ఉన్నారని వార్తలు వస్తున్నా, ఈ నేపథ్యంలో వీరంతా జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వారిపై వస్తున్న విమర్శలకు చెక్ పెడుతున్నారు. ఇది ప్రభుత్వంపై వ్యతిరేకతతోనే విమర్శలు చేస్తున్నారా.. లేక భుజాలు తడుముకుంటున్నారో.. తేలాల్సి ఉంది.
ఆ జాబితాలో అనగాని, ఏలూరి ముందున్నారు..
టీడీపీ నుంచి వైసీపీలో చేరతారని భావిస్తున్న గంటా పేరుతోపాటు పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాదా.. ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఏలూరి గతంలో ఈ వార్తలను ఖండిస్తూ.. తాను వైసీపీలో చేరేదిలేదని స్పష్టం చేశారు. కానీ.. పార్టీ కార్యక్రమాల్లో గానీ కార్యకర్తలకు అందుబాటులో ఉన్నదీ లేదు. ఏలూరిపై నియోజకవర్గంలో ఇప్పటికీ సందేహాలు ఉన్నాయి. అయితే.. వారం రోజులుగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ పత్రికా ప్రకటనలు ఇస్తున్నారు. ఈ జాబితాలోనే అనగాని సత్యప్రసాద్ కూడా ఉన్నారు. వైసీపీలో చేరతారని జోరుగా వార్తలు వచ్చినా ఆయన టీడీపీలోనే ఉన్నారు. జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఇన్నాళ్లూ సైలెంట్ గాన్న ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎందుకు బయటకు వస్తున్నారనేది సందేహంగా మారింది.