భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, నటి తమన్నా భాటియాలను అరెస్టు చేయాలని కోరుతూ ఓ న్యాయవాది మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ ఇద్దరూ ఆన్లైన్ జూదానికి సంధించిన యాప్స్ను ప్రమోట్ చేస్తున్నారని అందువల్ల వారిని అరెస్టు చేయాలని సదరు న్యాయవాది తన పిటిషన్లో కోరారు.
చెన్నైకి చెందిన ఓ న్యాయవాది విరాట్ కోహ్లి, తమన్నాలపై కోర్టులో పిటిషన్ వేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఇండియాలో చెలామణీలో ఉన్న గ్యాంబ్లింగ్ యాప్లను నిషేధించాలని తన పిటిషన్లో కోరానని తెలిపారు. కోహ్లి, తమన్నా లాంటి సెలబ్రిటీలు గ్యాంబ్లింగ్ యాప్లు, వెబ్సైట్లకు ప్రచారకర్తలుగా ఉన్నారని, అందువల్ల యువత వాటి బారిన పడి తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు.
ఆన్లైన్లో ఉన్న ఓ జూదం వెబ్సైట్లో పెద్ద ఎత్తున డబ్బులు నష్టపోయిన ఓ యువకుడు ఇటీవలే ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయాన్ని ఆ న్యాయవాది తన పిటిషన్లో చేర్చారు. కోహ్లి, తమన్నా లాంటి సెలబ్రిటీలు అలాంటి యాప్స్, సైట్లకు ప్రచారం చేయడాన్ని మానుకోవాలని డిమాండ్ చేశారు. వారు డబ్బులకు ఆశపడి అలా చేస్తుండడం వల్ల యువత వారికి ఆకర్షితులై సదరు యాప్లు, సైట్లలో డబ్బులు నష్టపోతున్నారని అన్నారు. కాగా ఆ న్యాయవాది వేసిన పిటిషన్ కోర్టులో ఆగస్టు 4న విచారణకు రానుంది.