ఒక పక్క కరోనా కష్ట కాలం నడుస్తోంది. ప్రజలు ఎక్కువగా ఇళ్లకే పరిమితం అవుతున్నారు. దీనితో దొంగ తనాలు చేస్తూ జీవనం సాగించే చోరాగ్రేసరులకు నాలుగు నెలలుగా పని లేకుండా పోయింది. ఇళ్లకు కన్నాలు వేయడం కుదరడం లేదు. దీనితో ఏమి చేయాలో తెలియక ఏకంగా బ్యాంకు ఏటీఎంకే కన్నం వేయాలని ప్రయత్నించారు. కానీ అది సాధ్యం కాకపోవడంతో ఏకంగా ఏటీఎంనే ఎత్తుకెళ్లారు ఆ ప్రభుద్దులు.
ఈ ఘటన తెలంగాణ రాష్ట్రం సిద్ధిపేట్ జిల్లాలోని రాజీవ్ రహదారిపై గల ప్రజ్ఞాపూర్ వద్ద జగదేవపూర్ వెళ్లే దారిలో జరిగింది. కొందరు దొంగలు ఇండియా వన్ ఏటీఎం నుంచి నగదును దొంగిలించేందుకు ప్రయత్నం చేశారు. అయితే డబ్బులు రాక పోవడం తో గడ్డ పలుగుతో ఏటీఎం మిషన్ ను పెకలించి ఎంచక్కా ఎత్తుకు వెళ్లిపోయారు. తెల్లవారే సరికి ఏటీఎం మిషన్ కనిపించక పోవడంతో ఇంటి యాజమాని.. సదరు బ్యాంకు ఏటీఎం నిర్వాహకులకు సమాచారం ఇచ్చాడు. దీంతో వారు గజ్వేల్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా ఏటీఎం దొంగతనంలో ఎంత మంది పాల్గొన్నారు? పాత నేరస్తుల వివరాలతో దొంగల ఆచూకీ కనుగొనే పనిలో పోలీసులు నిమగ్నమైయ్యారు. చోరీ జరిగిన సమయంలో ఏటీఎం లో రూ.4,98,800 నగదు ఉన్నట్లు ఏటీఎం నిర్వాహకులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.