CM Revanth Reddy: నీరు నేర్పిన విద్యే నీరజాక్ష అన్నట్లు .. గతంలో సీఎంగా ఉండగా కేసిఆర్ చేసిన పనే నేటి సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. కేసిఆర్ మొదటి సారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికి ఆ పార్టీకి చెందిన మెజార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. ఆ తర్వాత 2018లో రెండో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కూడా కేసీఆర్ ఇదే ఫందా ఫాలో అయ్యారు. మరల కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఇక స్కోప్ లేదు అన్న పరిస్థితిని కేసిఆర్ తీసుకువచ్చారు.
అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీనియర్ ను పక్కన పెట్టి రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు అప్పగించిన తర్వాత ఆయన తనదైన శైలిలో వ్యవహరిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేశారు. పార్టీ అధిష్టానం ఆదేశాలతో అసమ్మతి నేతలను కలుపుకుని ముందుకు సాగారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఒక ఊపు తీసుకువచ్చారు. పార్టీ అధికారంలోకి రావడానికి కారణభూతుడు అయ్యారు. ఇక ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ ప్రభుత్వం పూర్తి కాలం ఉండదు అంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ నేతలు పలు సందర్భాల్లో కామెంట్స్ చేశారు. దీంతో రేవంత్ రెడ్డి అలర్ట్ అయ్యారు. కేసీఆర్ గతంలో అనుసరించిన వ్యూహాన్ని రివర్స్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కీలక నేతలను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ ఆ పార్టీ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారు.
తాజాగా.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కు ఉన్న ఒక్కొగానొక్క ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకుని ఆ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ కు వరుస షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే అనేక మంది కీలక నాయకులు కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ గూటికి చేరడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతు అయ్యినట్లు అయ్యింది.
ఎప్పటి నుండి తెల్లం వెంకట్రావు ఎమ్మెల్యే కాంగ్రెస్ గూటికి చేరతారంటూ ప్రచారం జరిగినా ఇప్పుడు చేరికకు వేళ అయ్యింది. భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఇవేళ కాంగ్రెస్ గూటికి చేరారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంలో ఎమ్మెల్యే వెంకట్రావు, ఆయన అనుచరులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. నిన్న తుక్కుగూడ లో జరిగిన కాంగ్రెస్ జనజాతర సభలో వెంకట్రావు ప్రత్యక్షం కావడంతో ఆయన పార్టీ చేరడం ఖాయమైనట్లు వార్తలు వినబడ్డాయి.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ స్థానాలకు గానూ తొమ్మిది స్థానాలను కాంగ్రెస్ కైవశం చేసుకోగా, భద్రాచలంలో మాత్రం బీఆర్ఎస్ అభ్యర్ధి తెల్లం వెంకట్రావు గెలుపొందారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుడిగా ఉన్న తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేయాలని భావించారు. కానీ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే పొదెం వీరయ్యకు పార్టీ అధిష్టానం టిక్కెట్ ఇచ్చింది.
కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే వీరయ్య పై తెల్లం వెంకట్రావు 5వేలపైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2018 ఎన్నికల నుండి ఈ ఇద్దరు ప్రత్యర్ధులు కావడంతో తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరికను మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య వ్యతిరేకించారు. అయితే వీరయ్యకు అటవీ కార్పోరేషన్ చైర్మన్ గా అవకాశం కల్పించడంతో శాంతించినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ గూటికి చేరారు. తెల్లం వెంకట్రావు చేరికతో ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం కాంగ్రెస్ వశమైంది.
Breaking: పరవాడ ఫార్మాసిటీలో రెండు ప్రమాదాలు ..ఒకరు మృతి, ఆరుగురు కార్మికులకు అస్వస్థత