ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు కరోనా వైరస్ కంటే మూడు రాజధానులు అంశం పెద్ద హాట్ టాపిక్ అయింది. గవర్నర్ మూడు రాజధానులు బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ముఖ్యంగా మొదటి నుండి అమరావతినే ఏకైక రాజధానిగా ఉండాలని బలంగా పట్టుబడుతున్న టిడిపి ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో, ఇప్పుడు మరో అస్త్రాన్ని తెరపైకి తీసుకురావడానికి రెడీ అవ్వుతున్నట్లు టాక్. అదే మూకుమ్మడి రాజీనామాలు.
అమరావతినే రాజధానిగా ఉంచాలని డిమాండ్ చేస్తూ…. మూడు రాజధానులు అంశానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ… పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సహా మిగతా టీడీపీ ఎమ్మెల్యేలంతా సామూహిక రాజీనామా చేయడానికి రెడీ అయినట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందుకోసం త్వరలోనే గవర్నర్ ని కలిసి రాజీనామా పత్రాలను సమర్పించే యోచనలో టిడిపి పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నట్లు టాక్.
ఒకేసారి ఒక పార్టీ అధినేత సహా మొత్తం ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే… అది దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశంగా మారే అవకాశం ఉండటంతో… కేంద్రంపై ఒత్తిడి తీసుకు వచ్చే కోణంలో చంద్రబాబు ఈ అస్త్రాన్ని ఉపయోగించాలని, అమరావతిని రెఫరెండంగా తీసుకుని ఏపీలో ఉప ఎన్నికలకు వెళ్లడానికి చంద్రబాబు రెడీ అవుతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఏపీలో రాజధానిగా అమరావతినే గుర్తించాలనే అంశాన్ని తెలంగాణ ఉద్యమం మాదిరిగా నడిపించే యోచనలో బాబు ఉన్నట్లు టిడిపి పార్టీలో టాక్.