దాదాపు పార్టీ ఆవిర్భావం నుంచి కూడా టీడీపీకి అండగా ఉంటున్న నాయకుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు, నటుడు మాగంటి మురళీ మోహన్ కూడా సైకిల్ దిగబోతున్నారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది . అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు భవిష్యత్తులో ఇక రాజకీయాల జోలికి వెళ్లకూడదని అయన నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
ఇందుకు ప్రధాన కారణంగా ఆయన అనారోగ్యాన్ని చూపుతున్నప్పటికీ అంతకు మించి వ్యాపార వ్యవహారాలు కూడా ఆయన ఈ నిర్ణయం తీసుకోవడానికి దోహదపడినట్లు చెబుతున్నారు పార్టీలో ప్రాధాన్యం మాట ఎలా ఉన్నప్పటికీ.. ప్రస్తుతం మురళీ మోహన్ ఆరోగ్య పరిస్థితి కొంత ఇబ్బందిగానే ఉంది. అదే సమయంలో రూపాదేవి కూడా వ్యాపారంలో బిజీగా ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ కార్యక్రమాల్గో పాల్గొనడం అన్ని విధాలా నష్టమన్న నిర్ణయానికి వీరు వచ్చేసినట్టు టీడీపీ వర్గాలే చర్చించుకుంటున్నాయి. అందుకే పార్టీకి దూరంగా ఉంటున్నారని వార్తలు వస్తున్నాయి.అసలు టీడీపీ పరిస్థితి బాగోకపోవడంతో బయటకు వచ్చేందుకు.. రాజమండ్రి లోక్సభ నియోజకవర్గం వైపు తొంగి చూసేందుకు కూడా ఈ కుటుంబం ఇష్టపడడం లేదట.
టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి అన్ని విధాలా అండదండలు అందిస్తోన్న మురళీ మోహన్కు ఎంపీ అవ్వాలన్నది చిరకాల కోరిక. చంద్రబాబు రాజ్యసభ సీటు ఆఫర్ చేసినా తాను లోక్సభకే పోటీ చేస్తానని పట్టుబట్టి మరీ 2009లో రాజమండ్రి ఎంపీగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత ఐదేళ్ల పాటు ప్రజల్లోనే ఉన్న ఆయన 2014లో ఘనవిజయం సాధించి పార్లమెంటులో అడుగు పెట్టాలన్న తన కోరిక తీర్చుకున్నారు. అనారోగ్యం కారణంతో 2019 పార్లమెంట్ ఎన్నికలకు ఆయన దూరంగా ఉండగా ఆయన కోడలు రూపాదేవి రాజమండ్రిలో పోటీ చేసి ఓడిపోయాక రాజకీయంగా మురళీ మోహన్ కుటుంబం ఊసే ఎక్కడా లేదు. గత నెలలో జరిగిన మహానాడులోనూ ఈ ఇద్దరి జాడా ఎక్కడా కనిపించలేదు. ఈ విషయమై పార్టీ సీనియర్లు కొందరు ఆరా తీయగా మురళీ మోహన్ రాజకీయాల నుంచి వైదొలగాలన్న నిర్ణయానికి వచ్చేసినట్లు తేలిపోయింది.ప్రస్తుతం టిడిపి పరిస్థితి,తన అనారోగ్యం ,రాజమండ్రిలో కోడలు రూపాదేవి ఒక్కరే ఉండాల్సి రావటం, వ్యాపార లావాదేవీలు అన్నింటినీ బేరీజు వేసుకున్న మురళీ మోహన్ రాజకీయాలకు దూరంగా ప్రశాంతంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు ఆ వర్గాలు .ఇదంతా గమనిస్తే టిడిపికి మురళీ మోహన్ కుటుంబం దూరంగా వుండిపోవటం ఖాయమంటున్నారు