Revanth Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారిన విషయం తెలిసిందే. ఈసారి కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో ఎలాగైనా గెలిపించాలనే నిశ్చితాభిప్రాయంతో ఆయన ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో అతను కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి తాజాగా ట్విట్టర్ ద్వారా తెలిపారు.
తనకు కోవిడ్-19 పరీక్షలో పాజిటివ్ గా నిర్ధారణ అయిందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం తేలికపాటి లక్షణాలు ఉన్నాయని చికిత్స తీసుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. గత కొద్ది రోజుల సమయంలో తనని కలిసినవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. మహమ్మారి నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సురక్షితంగా ఉండాలని ఆయన అందరికీ విజ్ఞప్తి చేశారు. అయితే కరోనా స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న రేవంత్ రెడ్డి త్వరలోనే కోలుకుంటారని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. త్వరగా కోలుకోవాలని మరికొందరు కాంగ్రెస్ పార్టీ అభిమానులు ట్విట్టర్ వేదికగా ప్రార్థనలు చేస్తున్నారు. వీరందరికీ ధన్యవాదాలు చెబుతున్నారు రేవంత్ రెడ్డి.
రేవంత్ రెడ్డిని కలిసిన వ్యక్తులు ఇప్పుడు కాస్త కలవరపాటుకు గురైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కోవిడ్-19 నిర్ధారణ టెస్టులు చేయించుకోవడానికి వెళ్తున్నారు.