KCR: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) బిషాణ ఎత్తేసినట్లే కనబడుతోంది. ఇక్కడి ఆ పార్టీ నేతలు తమ దారి తాము చూసుకుంటున్నారు. కొందరు నాయకులు కాంగ్రెస్ కండువా కప్పుకొని ఏపీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు. ఏడాది కింద ఏపీలో అట్టహాసంగా బీఆర్ఎస్ కార్యకలాపాలు ప్రారంభించారు.
తెలంగాణలో కుమారుడు కేటిఆర్ కు పట్టాభిషేకం చేసి తాను జాతీయ రాజకీయాల్లో స్టీరింగ్ తిప్పాలనుకున్నారు బీఆర్ఎస్ (టీఆర్ఎస్) అధినేత కేసిఆర్. ఆ క్రమంలోనే ప్రాంతీయ పార్టీగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ను జాతీయ పార్టీ బీఆర్ఎస్ గా మార్పు చేశారు.
బీఆర్ఎస్ ను ముందుగా పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ విస్తరించాలని భావించారు గులాబి అధిపతి కేసిఆర్. కర్ణాటకలో కేసిఆర్ నమ్ముకున్న కుమార స్వామి హ్యాండ్ ఇచ్చారు. దీంతో ఆ రాష్ట్రంలో పార్టీ విస్తరణ బ్రేక్ పడింది. మహారాష్ట్ర లో నాందేడ్ తదితర జిల్లాలో బీఆర్ఎస్ విస్తరణకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు కేసిఆర్. పలు మార్లు ఆ రాష్ట్రంలో పర్యటించారు.
మరో పక్క తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో విశ్రాంత ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ ను ఏపీ అధ్యక్షుడుగా నియమించారు. మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, చింతల పార్థసారధి సహా ఏపీలోని పలు జిల్లాల నుండి గత ఏడాది జనవరి 2న పలువురు నేతలు బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. కేసిఆర్ వీరందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఏపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా తమతో టచ్ లో ఉన్నట్లు ఆ నేతల చేరికల సందర్భంగా కేసిఆర్ ప్రకటించారు. అయితే ఏడాది తిరగకముందే కేసిఆర్ అంచనాలు తారు మారు అయ్యాయి. తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమితో ఏపీలోని ఆ పార్టీ నేతలే కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీతో టచ్ లోకి వెళ్లారు.
ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ గుంటూరులో పార్టీ కార్యాలయం ప్రారంభించినా, ఆయన ఏపీలో కంటే తెలంగాణలోనే ఎక్కువగా ఉంటున్నారు. మహారాష్ట్రలో పార్టీ ఆఫీసుల ప్రారంభోత్సవాలు, బహిరంగ సభలకు ప్రత్యేక విమానాల్లో వెళ్లిన కేసిఆర్ .. ఏపీలో పార్టీ ప్రారంభోత్సవానికి మాత్రం హజరు కాలేదు.
గత ఏడాది ఆగస్టు నుండి పూర్తిగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నిమగ్నమై ఉండటంతో ఏపీలో కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేశారు. ఆ తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో ఏపీ బీఆర్ఎస్ ముఖ్య నేతలు సైలెంట్ అయిపోయారు. పార్టీ ముఖ్యనేతలే సైలెంట్ అవ్వడం, బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ కూడా ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో పర్యటించే పరిస్థితి లేకపోవడంతో ఏపీలో జెండా పీకేసినట్లేనని భావిస్తున్నారు. ఆ పార్టీలో చేరిన నేతలంతా తమ దారి తాము చూసుకుంటున్నారు.
Ayodhya Ram Mandir Pratishtha: అయోధ్యలో సందడే సందడి .. ఇప్పటికే చేరుకున్న ప్రముఖులు