పశ్చిమ బెంగాల్లో బీజెపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా కాన్వాయ్పై రాళ్ల దాడి జరగడాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఆ రాష్ట్ర డీజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర హోంశాఖ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 14వ తేదీన హోంశాఖ కార్యదర్శి ఎదుట హాజరు కావాలన ఆదేశించింది. అదే విధంగా రాష్ట్రంలో శాంతి భద్రతలపై నివేదిక అందజేయాలని పేర్కొన్నది.
పశ్చిమ బెంగాల్లో జెపి నడ్డా నిన్న పర్యటిస్తున్న సమయంలో ఆయన కాన్వాయ్పై రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం నడ్డా కోల్కతా నుండి 24 పరగణాల జిల్లాలోని డైమండ్ హార్బర్ లో పార్టీ కార్యకర్తల సమావేశానికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ఈ దాడికి పాల్పడింది టీఎంసీ కార్యకర్తలేనని బీజెపి ఆరోపించింది. అయితే బీజెపీ ఆరోపణలను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఖండించారు. ఇదంతా బీజెపీ నాటకమంటూ కొట్టిపారేశారు.
మరో పక్క రాష్ట్ర గవర్నర్ ధన్కర్ నడ్డాపై కాన్వాయ్పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఘటనపై హోంశాఖకు నివేదిక పంపారు. నడ్డా పర్యటనకు భద్రత కల్పించడంలో తృణమూల్ ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. స్థానిక పోలీసులు ప్రోటోకాల్ పాటించకపోవడం వల్లనే ఈ ఘటన జరిగిందన్నారు. నడ్డా పర్యటన సమాచారం ముందస్తుగా పోలీసు శాఖకు ఉన్నప్పటికీ భద్రత కల్పించలేదని గవర్నర్ తన నివేదికలో పేర్కొన్నారు.
కాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా త్వరలో పశ్చిమ బెంగాల్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 19 లేదా 20వ తేదీలలో ఆయన కోల్కతాలో పర్యటించనున్నట్లు సమాచారం. నడ్డా కాన్వాయ్పై రాళ్ల దాడి జరిగిన నేపథ్యంలో అమిత్ షా పర్యటనకు బయలు దేరడం ప్రాధాన్యతను సంతరించుకున్నది.