కాలానుగుణంగా మనిషి మారతాడు .మారాలి కూడా. రాజకీయ నాయకులు కూడా అదే పనిచేస్తారు. చంద్రబాబు నాయుడు సైతం ఇందుకు అతీతుడేమీ కాదు.
ఇప్పటికే చంద్రబాబుకు తన భవిష్యత్ అర్థమైపోయింది .తన పార్టీకి ఉన్న ఇరవై మూడు మంది ఎమ్మెల్యేల్లో కరణం బలరాం మద్దాళి గిరి వల్లనేని వంశీలను ఇప్పటికే వైసీపీ లాగేసింది. చిన్నాచితకా నాయకులను కూడా వైసీపీ వదలడం లేదు.టిడిపి నాయకుల సత్తాను వైసీపీ పరిగణించడం లేదు.ఎవరిని పడితే వారిని లాగేసుకోవడం ద్వారా టిడిపిని దెబ్బతీయడమన్న మైండ్ గేమ్ ఆడుతుంది.
చంద్రబాబు నాయుడి ప్రతిపక్ష నాయకుడి హోదాను కూడా తీసేసే ప్రయత్నాల్లో వైసీపీ ఉంది.ఈ నేపథ్యంలో మరో ఐదుగురు టిడిపి ఎమ్మెల్యేలు వైసీపీకి వెళ్లిపోతారని చంద్రబాబు నాయుడు వద్ద గట్టి సమాచారం ఉందట. గంటా శ్రీనివాసరావు తో సహా ఇంకో నలుగురు పేర్లు చంద్రబాబుకి తెలుసంట. మహా అయితే తన వద్ద 13 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగులుతారు అన్న అంచనాతో చంద్రబాబు నాయుడు తన భవిష్యత్ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారట.
తాను తన వియ్యంకుడు బాలయ్య, గోరంట్ల బుచ్చయ్య చౌదరి , ఆదిరెడ్డి భవాని ,జోగేశ్వరరావు, అనగాని సత్యప్రసాద్, ఏలూరి సాంబశివరావు, డివి స్వామి, గొట్టిపాటి రవికుమార్, నిమ్మల రామానాయుడు ,వెలగపూడి రామకష్ణ ప్రసాద్ వంటి కొందరు ఎమ్మెల్యేలు మాత్రమే టిడిపిలో పూర్తికాలం కొనసాగుతారని చంద్రబాబు నమ్మకంగా ఉన్నారు. వీరితోనే రాజకీయం చేయడానికి ఆయన కొత్త కొత్త ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా పార్టీలో యువతకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. పార్టీ సీనియర్ల రాజకీయ వారసులను రంగంలోకి దింపి వారికి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించి వైసీపీకి ధీటుగా తయారు చేసే పథక రచన సాగుతోందట.
చినబాబు లోకేష్ ను కూడా రాజకీయంగా రేసుగుర్రంలా తయారుచేసే ప్రతిపాదన ఒకటి చంద్రబాబు మదిలో మెదులుతోందట .ఇందులో భాగంగానే ఆయన చేత సైకిల్ యాత్ర చేయించడానికి రూటు మాప్ ని కూడా సిద్ధం చేస్తున్నారు లోకేశ్ సైకిల్ యాత్ర అక్టోబర్ రెండో తేదీన మొదలయ్యే అవకాశముందని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు ఇప్పుడు దెబ్బతిన్న పులి అని భవిష్యత్తులో బలంగానే పంజా విసురుతారని టిడిపి వర్గాలు చెబుతున్నాయి.