Chandrababu: రాజమండ్రి రూరల్ సీటు పంచాయతీ టీడీపీ అధినేత చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా మారుతోంది. పొత్తులో భాగంగా ఈ సీటు త్యాగం చేయడానికి సీనియర్ నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సిద్దంగా లేరు. జనసేన – టీడీపీ పొత్తు నేపథ్యంలో పలు కీలక స్థానాలను చంద్రబాబు జనసేనకు వదులుకోవాల్సిన పరిస్థితి ఉంది. రాజమండ్రి రూరల్ స్థానంలో జనసేనకు మంచి ఓటు బ్యాంక్ ఉండటంతో పాటు బలమైన నేత కూడా ఉండటంతో ఈ స్థానం నుండి కచ్చితంగా పోటీ చేయాలని భావిస్తుంది.
గత ఎన్నికల్లో జనసేన అభ్యర్ధిగా పోటీ చేసిన కందుల దుర్గేష్ కు 40వేలకుపైగా ఓటింగ్ వచ్చింది. 2009లోనూ ప్రజారాజ్యం పార్టీ అభ్యర్ధికి 40వేలకు పైగా ఓట్లు వచ్చాయి. అయితే ఇక్కడ త్రిముఖ పోరు జరిగినా 2009లో, 2019 లోనూ టీడీపీ అభ్యర్ధులే విజయం సాధించారు. సిట్టింగ్ స్థానాన్ని వదులుకోవడానికి బుచ్చయ్య చౌదరి సిద్దంగా లేరు. ఈ సారి కూడా పోటీ చేస్తానని బుచ్చయ్య చౌదరి పలు మార్లు ప్రకటించారు. అయితే తాజాగా నిన్న రాజమండ్రిలో జనసేన పార్టీ ముఖ్యనేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించి రాజమండ్రి రూరల్ నుండి కందుల దుర్గేష్ పోటీ చేస్తారని చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. జనసేన అభ్యర్ధిగా కందుల దుర్గేష్ ను ప్రకటించడంతో ఆ పార్టీ నాయకులు ఆయనకు అభినందనలు కూడా చెబుతున్నారు.
తాజాగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గ టికెట్ తనదేనని గోరంట్ల బుచ్చయ్చ చౌదరి మరో సారి ధీమా వ్యక్తం చేశారు. ఆయన తాజాగా చేసిన ట్వీట్ రెండు పార్టీల్లో హాట్ టాపిక్ అయ్యింది. రాజమండ్రి రూరల్ టీడీపీ కార్యకర్తలకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు విజ్ఞప్తి అంటూ బుచ్చయ్య ట్వీట్ చేశారు. టీవీ న్యూస్ లలో వాట్స్ ఆప్ మేసేజ్ ల్లో వస్తున్న వార్తలు అనేవి ఊహజనితం అని అన్నారు. అవి నమ్మి భావోద్వేగాలకు గురి అవ్వొద్దని సూచించారు. నారా చంద్రబాబు ఆదేశాల మేరకు కచ్చితంగా గోరంట్ల పోటీలో ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. దీంతో ఎటువంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. దీనికి సంబంధించి తొందరలో చంద్రబాబు చే అదికారిక ప్రకటన ఉంటుందని అన్నారు. ఈ ట్వీట్ తో రాజమండ్రి రూరల్ టికెట్ పంచాయతీ ఆసక్తికరంగా మారింది.
ఏడు పదుల వయసు దాటిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీలో చంద్రబాబు కంటే సీనియర్. టీడీపీ ఆవిర్భావం 1983 నుండి ఆ పార్టీలో ఉన్నారు. రాజమండ్రి సిటీ నుండి నాలుగు సార్లు, రూరల్ నుండి రెండు సార్లు మొత్తం ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో మంత్రిగానూ బాద్యతలు నిర్వహించారు. ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగానూ ఉన్నారు. రాజమండ్రి రూరల్ విషయంలో టీడీపీ – జనసేన నేతల మధ్య ఏకాభిప్రాయం ఇంత వరకూ కుదరకపోవడంతో ఇక్కడ పొత్తు వికటిస్తుందనే మాట వినబడుతోంది. ఇక్కడ పొత్తు వికటిస్తే ఆ పరిణామాలు తమకు లాభం చేకూరుస్తాయని వైసీపీ భావిస్తుంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు రాజమండ్రి రూరల్ విషయంలో ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.
Cotton Candy: తమిళనాడులో పీచు మిఠాయిపై నిషేదం విధించిన తర్వాత ఏపీలోనూ ఆ దిశగా చర్యలు..?